ఆమనగల్లు : ఆర్థిక సమస్యలతో వ్యక్తి మృతి చెందిన సంఘటన మాడ్గుల మండల కేంద్రంలో చోటు చేసుకుంది. శుక్రవారం సీఐ కృష్ణమోహన్ కథనం ప్రకారం.. మాడ్గుల మండల కేంద్రానికి చెందిన పావలయ్య (39) భార్య ఆలివేలుతో కూలి పనులు చేసుకుంటూ గ్రామంలోనే జీవనం కొనసాగిస్తున్నాడు. కొంతకాంలగా ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతూన్నాడు. బాధితుడు గురువారం ఉదయం ఇంటి నుంచి కూలీ పనికి వేళ్తున్ననని భార్యకు చెప్పి వెళ్లాడు. శుక్రవారం గ్రామానికి చెందిన గొర్రెల కాపరి జంగయ్య గ్రామ సమీపంలోని చెట్టుకు పావలయ్య ఉరేసుకున్నట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహన్ని కిందకు దింపి పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. భార్య అలివేలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని తెలిపారు.
మనస్తాపంతో విద్యార్థిని ఆత్మహత్య
మాడ్గుల మండలంలోని దిల్వార్ఖాన్పల్లి గ్రామంలో తండ్రి మందలించాడని మనస్థాపానికి గురై విద్యార్థి ఆత్మహత్య చేసుకుంది. సీఐ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బావాజీ వెంకటయ్య, లక్ష్మమ్మ దంపతులకు ఒక కూతురు, ఇద్దరు కుమారులు ఉన్నారు. కూతురు రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వ గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతుంది. కూతురు ఆన్లైన్ తరగతులు వినడం లేదని తండ్రి శైలజను మందలించాడు. దీంతో మనస్థాపానికి గురైన శైలజ వారి ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు బాధితురాలిని చికిత్స నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమించడంతో మేరుగైన వైద్యం కోసం నగరంలోని ఉస్మానియా దవాఖానకు తరలించారు. చికిత్సపొందుతూ శైలజ శుక్రవారం మృతి చెందినట్లు సీఐ పేర్కొన్నారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.