వెబినార్ ద్వారా అందుకున్న స్థానిక ప్రజాప్రతినిధులు
నమస్తే తెలంగాణ నెట్వర్క్: జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం జాతీ య స్థాయిలో ఇచ్చే పురస్కారాలకు ఎంపికైన స్థానిక సంస్థలకు శనివారం ప్రధాని నరేంద్రమోదీ అవార్డులు ప్రదానం చేశారు. 2019-20 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో స్థానిక సంస్థలకు దీన్దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ స్వశక్తీకిరణ్ పురస్కారాలను ఢిల్లీ నుంచి వెబినార్ ద్వారా అందజేశారు. ఈ సందర్భంగా సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ మంజూశ్రీ జైపాల్రెడ్డి కలెక్టరేట్ నుంచి ఆన్లైన్ వేదికగా అందుకున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నాలుగు గ్రామాలు, రెండు మండల పరిషత్లు సైతం పురస్కారాలు అందుకున్నాయి. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని సుందిళ్ల పంచాయతీ తరఫున పురస్కారాన్ని సర్పంచ్ దాసరి లక్ష్మి అందుకున్నారు. ధర్మారం మండల పరిషత్కు దీన్ దయాళ్ స్వశక్తీకరణ పురస్కారాన్ని ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ, ఎంపీడీవో జయశీల, జగిత్యాల జిల్లా కోరుట్ల మండల పరిషత్ తరఫున ఎంపీపీ తోట నారాయణ అందుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మోహినికుంట, ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్నగర్ గ్రామాల సర్పంచులు కల్వకుంట్ల వనజ, తెడ్డు అమృత, కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పర్లపల్లి సర్పంచ్ మాదాడి భారతి పురస్కారాలను అందుకున్నారు.