మాడ్రిడ్ : స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ లో మతిస్థిమితం లేని వ్యక్తి తన తల్లిని చంపి ఆమెను తినడం కలకలం రేపింది. ఈ కేసులో నిందితుడికి 15 ఏండ్ల 5 నెలల జైలు శిక్ష విధించారు. 2019 జనవరిలో అల్బెర్టో సాంచెజ్ గోమెజ్ (28) తన తల్లిని దారుణంగా చంపి ఆమె శరీరాన్ని ముక్కలుగా చేసి ఆపై 15 రోజుల పాటు తిన్నాడు. ఈ కేసులో సాంచెజ్ ను అదే ఏడాది ఫిబ్రవరిలో అరెస్ట్ చేయగా ఏప్రిల్ లో విచారణ మొదలైంది.
నిందితుడికి న్యాయస్థానం తల్లిని హత్య చేసినందుకు 15 ఏండ్లు, మృతదేహాన్ని అపవిత్రం చేసినందుకు ఐదు నెలల జైలు శిక్ష విధించింది. దీంతో పాటు సోదరుడికి పరిహారం కింద 73,000 డాలర్లు చెల్లించాలని కోర్టు సాంచెజ్ ను ఆదేశించింది. కాగా, మానసికంగా కుంగుబాటుకు లోనైన సాంచెజ్ తల్లిని హత్య చేసి ఆమె మృతదేహంలో పలు భాగాలను టప్పర్ వేర్ బాక్సుల్లో ఉంచినట్టు స్పెయిన్ పోలీస్ అధికారులు గుర్తించారు. ఓ విషయంలో వాగ్వాదం జరగడంతో ఆవేశంలో సాంచెజ్ తన తల్లిని చంపినట్టు పోలీసులు కనుగొన్నారు. ఆపై ఆమె శరీరాన్ని కత్తులు, కార్పెంటర్ వాడే రంపంతో కోసి వాటిలో కొన్ని ముక్కలను ఫ్రీజర్ లో, మరికొన్ని ప్లాస్టిక్ బ్యాగుల్లో కుక్కాడు.