ముంబై : కరోనా సెకండ్ వేవ్ విరుచుకుపడటంతో పలువురి ప్రాణాలు గాలిలో కలిసిపోతుండగా వారి కుటుంబ సభ్యులు, ఆత్మీయులు తీవ్ర వేదనకు గురవుతున్నారు. పెంపుడు జంతువులు సైతం మహమ్మారి ప్రభావంతో మూగగా రోదిస్తున్న పరిస్థితి నెలకొంది. పుణేలోని కొరెగావ్ ఫ్లాట్ లో తమ బాగోగులు చూస్తున్న యజమాని దంపతులు కొవిడ్-19తో కన్నుమూయగా వారి ఇంట్లోని 16 పిల్లులు అనాధలుగా మారాయి.
నదియా (60) సతీష్ పాఠక్ (77) దంపతులు కరోనా మహమ్మారితో మరణించగా ఇక తమ ఆలనాపాలన ఎవరు చూస్తారని పిల్లులు బిక్కమొహం వేశాయి. ప్రస్తుతం ఈ పిల్లులను ఇంట్లో ఉన్న ఇద్దరు పనివారు పరిరక్షిస్తుండగా వాటిని ఎవరికైనా అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నారు. పిల్లులకు మెరుగైన ఆసరా లభిస్తుందని ఆశిస్తున్నానని ఈజిప్ట్ లో స్థిరపడిన నదియా కుమార్తె ఆశాభావం వ్యక్తం చేశారు.