న్యూఢిల్లీ : కొవిడ్-19 వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారిలోనూ పాజిటివ్ కేసులు వెలుగులోకి వస్తున్న ఉదంతాలు వెల్లడవడం ఆందోళన కలిగిస్తోంది. పలువురు వైద్య సిబ్బందిలోనూ వ్యాక్సిన్ డోసు తీసుకున్న తర్వాత పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ప్రజలు కరోనా బారిన ఎందుకు పడుతున్నారనే దానిపై నిపుణులు పలు కారణాలను ముందుకు తెస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం ఆయా వ్యక్తులు మాస్క్ ధరించడం వంటి కొవిడ్ నిబంధనలను నిర్లక్ష్యం చేయడం ఒక కారణమని చెబుతున్నారు.
కొవిడ్-19తో ముంచుకొచ్చే వ్యాధికి వ్యతిరేకంగా వ్యాక్సిన్ భద్రత కల్పిస్తుందని ఇన్ఫెక్షన్ నుంచి కాదని నిపుణులు పేర్కొంటున్నారు. తీవ్ర అస్వస్ధత, మరణాలను నిరోధించడం వరకే వ్యాక్సిన్ సామర్ధ్యం పనిచేస్తుందని, ఇది కూడా రెండో డోసు తీసుకున్న రెండు మూడు వారాల తర్వాత ప్రభావవంతంగా పనిచేస్తుందని చెబుతున్నారు. వ్యాక్సినేషన్ తర్వాత ప్రజలు ఇన్ఫెక్షన్ బారినపడవచ్చు..దాని వ్యాప్తికి దోహదపడవచ్చనే కారణంతోనే వారు మాస్క్లు ధరించి భౌతిక దూరం పాటించాలని అంటువ్యాధుల నిపుణులు డాక్టర్ గిరిధర్ బాబు వివరించారు.
‘ఏ వ్యాక్సిన్ నూరుశాతం రక్షణ ఇవ్వదు..వ్యాక్సిన్ తీసుకున్న ప్రతి ఒక్కరూ వ్యాధి నుంచి బయటపడరు..వ్యాక్సిన్ వ్యాధి నుంచి రోగిని కాపాడుతుంది కానీ ఇన్ఫెక్షన్ నుంచి కాద’ని ప్రముఖ వ్యాక్సిన్ నిపుణులు, ప్రొఫెసర్, డాక్టర్ గగన్దీప్ కాంగ్ పేర్కొన్నారు.