విజయనగరం : ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. రూ. 2 కోట్ల విలువ చేసే 800 కిలోగ్రాముల గంజాయిని ఇద్దరు వ్యక్తుల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు పార్వతీపురం పోలీసులు తెలిపారు. గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్నారనే పక్కా సమాచారం అందడంతో తాము అప్రమత్తమయ్యామని పోలీసులు పేర్కొన్నారు. దీంతో పోలీసు బృందాలను రంగంలోకి దింపి తనిఖీలు చేపట్టామని పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు. గోచెక్క గ్రామం వద్ద గంజాయిని తరలిస్తున్న వాహనాన్ని సీజ్ చేసి.. ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వాహనాన్ని విశాఖపట్టణం ఏజెన్సీ ఏరియా నుంచి ఒడిశా మీదుగా బీహార్ తరలిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.