రామగిరి, మే 23 : గత రెండేళ్లుగా శాశ్వత వీసీ కోసం ఎదురుచూసిన మహాత్మాగాంధీ యూనివర్సిటీకి రెగ్యులర్ వైస్ చాన్స్లర్ను ప్రభుత్వం నియమించింది. నూతన వీసీగా ప్రొఫెసర్ సీహెచ్.గోపాల్రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేయడంతో ఆయన సోమవారం ఉదయం 8.30గంటలకు యూనివర్సిటీకి చేరుకొని విధుల్లో చేరనున్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు యూనివర్సిటీ రిజిస్ట్రార్తోపాటు వివిధ విభాగాల అధిపతులు సిద్ధమయ్యారు. యూనివర్సిటీ నాలుగో వీసీగా గోపాల్రెడ్డి ఆదివారం హైదరాబాద్లో తాత్కాలిక వీసీ అరవింద్కుమార్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఉస్మానియా యూనివర్సిటీలోని ఫిజిక్స్ విభాగంలో ప్రొఫెసర్గా పనిచేస్తూ అదే యూనివర్సిటీలో రిజిస్ట్రార్గా విధులు నిర్వహిస్తున్న ఆయన వీసీగా ఇక్కడకు వస్తున్నారు. 2007లో ఏర్పాటైన ఎంజీయూకు పలువురు వీసీలుగా పని చేశారు. తొలి ఇన్చార్జి వీసీగా సులేమాన్ సిద్ధికీ 2007 ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు కొనసాగారు. ఆ తర్వాత ప్రొఫెసర్ వి.గంగాధర్ రెగ్యులర్ వీసీగా, తర్వాత ప్రొఫెసర్ కట్టా నర్సింహారెడ్డి, ఖాజా అల్తాఫ్ హుస్సేన్ పని చేశారు. హుస్సేన్ పదవీకాలం జూలై 2, 2019తో ముగియడంతో అప్పటి నుంచి ఇన్చార్జి వీసీ పాలనలో కొనసాగుతున్నది.
వివిధ హోదాల్లో పనిచేసిన గోపాల్రెడ్డి..
ప్రొఫెసర్ గోపాల్రెడ్డి కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలోని పోతిరెడ్డిపేట గ్రామానికి చెందినవారు. తన విద్యాభ్యాసమంతా ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే సాగింది. జిల్లా పరిషత్ హైస్కూల్ చిగురుమామిడిలో పాఠశాల విద్య పూర్తిచేయగా, ఇంటర్మీడియట్(ఎంపీసీ)హుజూరాబాద్ జూనియర్ కళాశాలలో పూర్తిచేశారు. బీఎస్సీ(గణితం, ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్)వరంగల్లోని కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి 1981లో డిస్టింక్షన్ సాధించారు. 1983లో ఎమ్మెస్సీ ఫిజిక్స్(సాలిడ్ స్టేట్ ఫిజిక్స్)పూర్తిచేశారు. యూజీసీ నెట్, జేఆర్ఎఫ్ ఫెలోషిప్ సాధించి పీహెచ్డీని పూర్తి చేశారు.
ఉద్యోగ నిర్వహణలో ఎన్నో మైలురాళ్లు..
ప్రొఫెసర్ గోపాల్రెడ్డి 1990లో ఉస్మానియా యూనివర్సిటీ ఫిజిక్స్ విభాగంలో ఫ్యాకల్టీగా చేరారు. రెండు పరిశోధన ప్రాజెక్టులు, ఒక డీఎస్టీ ప్రోగ్రాం కింద ఉస్మానియా విశ్వవిద్యాలయం, అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ నిధులతో మరో ప్రాజెక్టు ఏఈఆర్బీ ముంబైలో పూర్తయ్యింది. మరో ప్రాజెక్టును ఇండోర్లోని యూజీసీ డేయి కాన్సోరియం ఫర్ సైంటిఫిక్ రిసెర్చ్లో కొనసాగింది. అదేక్రమంలో సైన్స్ విభాగంలో నిధులు సమకూర్చే రెండు పరిశోధన ప్రాజెక్టుల్లో కో ప్రిన్సిపాల్ ఇన్వెస్టిగేటర్ అండ్ టెక్నాలజీ, ఏఈఆర్బీలో ముగ్గరు పరిశోధనా విద్యార్థులకు పీహెచ్డీ ఇచ్చారు. అంతేకాకుండా ఆయన 50కి పైగా పరిశోధనా పత్రాలు అనేక అంతర్జాతీయ, జాతీయ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ శాశ్వత సభ్యుడిగా, లుంబినీసెస్ సొసైటీ ఆఫ్ ఇండియా, ఇండియన్ సొసైటీ, రేడియేషన్ ఫిజిక్స్, న్యూక్లియర్ ట్రాక్ సొసైటీ ఆఫ్ ఇండియా, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిక్స్, టీచర్స్ అండ్ సొసైటీ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ సాలిడ్ స్టేట్ సైన్సెస్లో పనిచేశారు.
ఉస్మానియాలో వివిధ విభాగాల్లో&ఉస్మానియా యూనివర్సిటీ ఫిజిక్స్ విభాగంలో హెడ్గా పనిచేశారు. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ అకడమిక్ కో ఆర్డినేటర్గా, వైస్ ప్రిన్సిపాల్గా పనిచేశారు. సైఫాబాద్ పీజీ కాలేజీలో ఫిజిక్స్ విభాగానికి హెడ్గా పనిచేశారు. ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్లో హెడ్గా, ఓయూ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టరేట్లో డైరెక్టర్గా పనిచేశారు. అదేవిధంగా డీన్ డెవలప్మెంట్, యూజీసీ ఎఫైర్స్లో, ఓయూ ఓఎస్డీ-2 వైస్ చాన్స్లర్గా వ్యవహరించారు. 2016 నుంచి ఇప్పటివరకు ఓయూ రిజిస్ట్రార్గా పనిచేశారు.