లక్నో: చాలా ఏండ్లుగా వినియోగించని లిఫ్ట్ను రిపేర్ కోసం తెరిస్తే అందులో ఒక మగ వ్యక్తి అస్థిపంజరం కనిపించింది. ఉత్తరప్రదేశ్ బస్తీ జిల్లా కైలిలోని ఒపెక్ హాస్పిటల్లో ఈ ఘటన జరిగింది. 500 పడకల ఆసుపత్రిని 1991లో నిర్మించారు. ఆసుపత్రిలోని లిఫ్ట్ 1997 వరకు పనిచేసింది. అనంతరం రిపేర్ రావడంతో గత 24 ఏండ్లుగా దానిని వినియోగించడం లేదు.
ఈ నెల 1న రిపేర్ కోసం ఆసుపత్రిలోని లిఫ్ట్ను తెరిచారు. అయితే అందులో ఒక మగ వ్యక్తి అస్థిపంజరం ఉండటం చూసి షాకయ్యారు. అతడు లిఫ్ట్లో చిక్కుకొని ఊపిరాడక చనిపోయాడా లేదా ఎవరైనా హత్య చేసి అందులో దాచిపెట్టారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు పోలీసులు, ఫోరెన్సిక్ విభాగం సిబ్బంది ఆ అస్థిపంజరాన్ని డీఎన్ఏ టెస్ట్ కోసం తరలించారు. ఈ మిస్టరీని ఛేదిస్తామని, 24 ఏండ్ల కిందట మిస్సైన వ్యక్తి సమాచారం గురించి సమీప పోలీస్ స్టేషన్లలో ఆరా తీస్తున్నట్లు బస్తీ అదనపు పోలీసు సూపరింటెండెంట్ దీపేంద్ర నాథ్ చౌదరి తెలిపారు. కాగా, ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.