హైదరాబాద్ : నగరంలోని చంచల్గూడలో ఓ యువకుడి మరణానికి కారణమైన ఆరుగురు (వీరిలో ఇద్దరు మైనర్లు) వ్యక్తులను డబీర్పురా పోలీసులు అరెస్టు చేశారు. చంచల్గూడ జైలు సమీపంలోని వీధుల్లో ఆదివారం అర్ధరాత్రి కొందరు యువకులు గ్రూపులుగా విడిపోయి ఘర్షణకు దిగారు. ఓ చిన్న వివాదంతో మొదలైన ఘర్షణ పెద్దదిగా మారింది. దీంతో యువకులు ఒకరిపై ఒకరు విచక్షణారహితంగా పిడిగుద్దులు గుప్పించుకున్నారు. అజీబ్, ముజీబ్, కమ్రాన్తో పాటు మరికొంత మంది చేసిన దాడిలో మహ్మద్ అద్నాన్(19) అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.
దీంతో అతడిని చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు ఉస్మానియా దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో యువకుడు మంగళవారం ఉదయం మృతిచెందాడు. పోలీసులు ఐపీసీ 304 (II), 341, 506 r/w 149 సెక్షన్ల కింద అదేవిధంగా ఎపిడమిక్ డీసీజ్ యాక్ట్ సెక్షన్ 3(1), విపత్తు నిర్వహణ చట్టం సెక్షన్ 51(b) కింద కేసు నమోదు చేశారు. నిందితులందరినీ కోర్టు ముందు హాజరు పరిచారు.