నల్లగొండ ప్రతినిధి, మే 5 (నమస్తే తెలంగాణ)/అశ్వారావుపేట: ఆంధ్రప్రదేశ్కు రాకపోకలపై ఆంక్షలు మొదలయ్యాయి. ప్రయాణాలు దాదాపు బంద్ అయ్యాయి. బుధవారం నుంచి ఏపీలో పాక్షిక లాక్డౌన్ అమల్లోకి రావడంతో తెలంగాణ సరిహద్దులు మూతపడ్డాయి. రాష్ట్రం నుంచి ఏపీలోకి ప్రవేశించే అన్ని ప్రధాన రహదారులపై లాక్డౌన్ సమయంలో ఆంక్షలు విధించారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే వాహనాలను అనుమతిస్తున్నారు. ముందస్తుగా మంగళవారం నుంచే ఏపీ పోలీసులు సాధారణ వాహనాలు లాక్డౌన్ సమయంలో రావద్దంటూ హెచ్చరికలు చేశారు. బుధవారం తొలిరోజు లాక్డౌన్ సందర్భంగా ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లోని ఏపీ సరిహద్దుల్లో చెక్పోస్టులు మూసివేశారు. సూర్యాపేట జిల్లా కోదాడ శివారులో ఆంధ్ర ప్రాంత పరిధిలోని గరికపాడు చెక్పోస్టు వద్ద పోలీసులను మోహరించారు. మధ్యాహ్నం 12 నుంచి హైదరాబాద్ వైపు నుంచి సాధారణ వాహనాలను నిలిపివేశారు. కేవలం అత్యవసర సర్వీసులు, గూడ్స్ వాహనాలకే అనుమతి ఇచ్చారు. ఇక పరిశ్రమలు, వ్యవసాయ అనుబంధరంగాల వాహనాలకు మినహాయింపునిచ్చారు. విమాన, రైల్వే ప్రయాణికులు టికెట్లు చూపిస్తే కూడా ప్రయాణానికి అనుమతించారు. వీరు కాకుండా ప్రభుత్వ, ప్రైవేటు వైద్య సిబ్బంది, వారి వాహనాలను కూడా పంపించారు. మిర్యాలగూడ మీదుగా గుంటూరు జిల్లావైపు వెళ్లే వాహనదారులను వాడపల్లి దాటాక పొందుగుల చెక్పోస్టు వద్ద నిలిపివేస్తున్నారు. నాగార్జునసాగర్ మీదుగా ఆంధ్రాలోకి ప్రవేశించే వాహనాలను కొత్త బ్రిడ్జి దాటాక రైట్బ్యాంక్ చెక్పోస్టు వద్ద నిలిపివేస్తున్నారు. విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై మధ్యాహ్నం రాకపోకలు చాలా వరకు తగ్గిపోయాయి. కేతేపల్లి మండలం కొర్లపహాడ్ టోల్ప్లాజా వద్ద సాయంత్రం వాహనాల రద్దీ లేకుండా బోసిపోయి కనిపించింది. అశ్వారావుపేట పట్టణ సమీపంలోని అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్పోస్టు మూతపడింది. ఆంధ్రా అధికారులు బారికేడ్లు ఏర్పాటుచేసిన రాకపోకలను బంద్ చేశారు. మొదటి రోజు ప్రయాణికుల రవాణాకు వెసులుబాటు కల్పించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వాహనదారులను ఆంధ్రప్రదేశ్లోకి వెళ్లటానికి అనుమతించారు.
ఏపీలో మొదలైన పాక్షిక లౌక్డౌన్
ఆంధ్రప్రదేశ్లో పాక్షిక లాక్డౌన్ (పగటిపూట కర్ఫ్యూ) బుధవారం నుంచి మొదలైంది. ఇది మే 18 వరకు అమలవుతుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటిరోజు ఉదయం ఆరుగంటల వరకు వ్యాపార సంస్థలు, దుకాణాలు, సంస్థలు, కార్యాలయాలు, విద్యాసంస్థలు, రెస్టారెంట్లు అన్నీ మూసివేస్తారు. పెళ్లిళ్లు, ఫంక్షన్లకు 20 మందిని మాత్రమే అనుమతిస్తారు. అంతరాష్ట్ర, అంతర జిల్లాల ప్రజారవాణాను సైతం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే అనుమతిస్తారు.