వెంగళరావునగర్ : విశాఖపట్నం నుంచి గంజాయి దిగుమతి చేసుకుని నగరంలో విక్రయిస్తున్న ఏడుగురిని టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి కిలోన్నర గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎస్.ఆర్.నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన సంఘటన వివరాలను ఇన్స్పెక్టర్ సైదులు తెలిపారు.
అమీర్పేట సౌత్ ఇండియా షాపింగ్మాల్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఎర్రగడ్డ శివాజీనగర్కు చెందిన రోహిత్ శక్తి, అమన్శక్తి అనే ఇద్దరు యువకులను వెస్ట్ జోన్ టాస్క్పోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఒక్కొక్కటీ 5 గ్రాముల చొప్పున 14 గంజాయి ప్యాకెట్లు లభించాయి. యువకులను విచారించగా ఎర్రగడ్డకు చెందిన ఆర్యన్శక్తి, ఎస్లీరాతే అనే యువకుల వద్ద తాము గంజాయిని కొనుగోలు చేశామని చెప్పారు. పోలీసులు ఆర్యన్శక్తి, ఎస్లీరాతేలను అరెస్టు చేసి విచారించారు.
వారిచ్చిన సమచారం మేరకు అవినాష్ అలియాస్ షారూఖ్ అనే యువకుడిని కూడా అరెస్టు చేశారు. వీరికి ఫతేనగర్కు చెందిన కాళీ గణేష్ అనే వ్యక్తి గంజాయి సరఫరా చేస్తున్నట్లు గుర్తించి పోలీసు కాళీ గణేష్ను కూడా అరెస్టు చేసి విచారిం చారు. మల్కాజిగిరికి చెందిన ఆలకుంట దీప(50) అనే మహిళ వద్ద తాము గంజాయి కొనుగోలు చేశామని కాళీ గణేష్ చెప్పడంతో ఆలకుంట దీపను కూడా అరెస్టు చేశారు. ఆమె వద్ద 1.40 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
దీప భర్త సాయిలు విశాఖపట్నం నుంచి నగరానికి గంజాయిని తీసుకువస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. సాయిలు ప్రస్తుతం విశాఖ పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. ఏడుగురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి మొత్తం 1.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం నిందితులను ఎస్.ఆర్. నగర్ పోలీసులకు అప్పగించారు.