న్యూఢిల్లీ : సోషల్ మీడియా వేదికలపై వ్యాపారవేత్తగా మభ్యపెడుతూ యువతులు, బాలికలను మోసగిస్తున్న వ్యక్తిని (21) ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు ఆన్లైన్ లో యువతులతో స్నేహం పెంచుకుని వారి ప్రైవేట్ ఫోటోలను సంపాదించి ఆపై వాటిని చూపి బెదిరిస్తూ వారి నుంచి డబ్బును గుంజేవాడు. నిందితుడిని అమిర్ గా పోలీసులు గుర్తించారు. సోషల్ మీడియాలో బిజినెస్ మేన్ గా చెప్పుకుంటూ యువతులు, బాలికలను టార్గెట్ చేసుకునేవాడు. యూపీలోని బిజ్నూర్ కు చెందిన అమిర్ క్షురకుడిగా పనిచేసేవాడు.
తన ఇన్స్టా ఖాతాలో నిందితుడు అమిర్ బిజినెస్ మేన్ గా ప్రొఫైల్ లో పేర్కొన్నాడు. యువతులు, బాలికలతో స్నేహం పెంచుకుని వారి ప్రైవేట్ ఫోటోలను పంపాలని కోరేవాడు. ఆపై ఆ ఫోటోను చూపి డబ్బులు ఇవ్వాలని లేదంటే సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరించేవాడు. అమిర్ ఆగడాలపై పలువురు యువతులు, బాలికలు మౌనం దాల్చినా ఢిల్లీలోని అలీపూర్ కు చెందిన 13 ఏండ్ల బాలిక నిందితుడి వ్యవహారాన్ని తండ్రికి తెలిపింది. బాలిక తండ్రి పోలీసులను ఆశ్రయించగా నిందితుడిపై పోక్సో కేసు నమోదైంది. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి అతడి మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు.