చెన్నై: తమిళనాడుకు చెందిన ఆధ్యాత్మిక గురువు శివశంకర్ బాబాపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. చెన్నై సమీపంలోని కేలంబక్కం వద్ద సుశీల్ హరి ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్ను ఆయన నిర్వహిస్తున్నారు. కాగా, శివశంకర్ బాబా తమపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆ విద్యా సంస్థలో చదివిన పలువురు విద్యార్థినులు ఆరోపించారు. తాము ఎదుర్కొన్న వేధింపులకు సంబంధించిన వివరాలను సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. ఈ ఫిర్యాదులపై స్పందించిన పిల్లల సంక్షేమ సంఘం తమ ఎదుట హాజరు కావాలని శివశంకర్ బాబాకు సమన్లు జారీ చేసింది. అయితే ఆయన హాజరుకాలేదు. ఆయన ఉదర సంబంధ సమస్యలతో డెహ్రాడూన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు అనుచరులు తెలిపారు.
ఈ నేపథ్యంలో ముగ్గురు బాధితుల ఫిర్యాదు మేరకు కేలంబక్కం మహిళా పోలీస్ స్టేషన్లో శివశంకర్ బాబాకు వ్యతిరేకంగా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాబాపై లైంగిక వేధింపు ఆరోపణలు చేసిన 13 మందిలో ఇద్దరు మైనర్లు ఉన్నారు. దీంతో కేసు తీవ్రత నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం ఈ కేసు దర్యాప్తును సీబీసీఐడీకి అప్పగించింది.