చెన్నై : తనకు తాను స్వామీజీగా చెప్పుకునే సుశీల్ హరి ఇంటర్నేషనల్ స్కూల్ వ్యవస్థాపకుడు శివశంకర్ బాబాపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. తన రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులను ఆయన లైంగికంగా వేధింపులకు గురిచేసినట్టు అభియోగాలున్నాయి. శివశంకర్ బాబాపై పలు ఫిర్యాదులు రావడంతో ఆయనపై పోస్కో చట్టం కింద కేసు నమోదైంది. శివశంకర్ గతంలో తనకు గుండెపోటు వచ్చిందని అంటూ తమిళనాడు బాలల హక్కుల కమిషన్ (టీఎన్సీపీసీఆర్) ఎదుట విచారణకు గైర్హాజరయ్యారు.
లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ శివశంకర్ బాబాపై విద్యార్ధుల ఫిర్యాదులపై ఎఫ్ఐఆర్ లు నమోదు కాగా కేసును ప్రభుత్వం సీబీసీఐడీకి బదలాయించింది. కాగా ప్రస్తుతం బాబా డెహ్రాడూన్ లో ప్రైవేట్ దవాఖానలో చేరి చికిత్స పొందుతున్నాడు. స్కూల్ పూర్వ విద్యార్థులు గతంలో బాబా తమను లైంగిక వేధింపులకు గురిచేశాడని ట్విటర్ లో ఆరోపించగా శివశంకర్ బాబాతో పాటు టీచర్లకు టీఎన్సీపీసీఆర్ సమన్లు జారీ చేసింది.