అమల్లోకి అన్లాక్ 2.0
లాక్డౌన్ సడలింపు అన్లాక్ 2.0 గురువారం నుంచి అమల్లోకి వచ్చింది. ఉదయం 6 నుంచి సాయంత్రం 5 వరకు లాక్డౌన్ సడలింపు.. మరోగంట అంటే సాయంత్రం 6 వరకు గమ్యస్థానాలకు వెళ్లేందుకు అనుమతిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 19 వరకు ఈ నిబంధనలు అమల్లో ఉండనున్నాయి. ఇక సాయంత్రం 6 దాటితే అత్యవసర, వైద్య సేవలకోసం వెళ్లేవారు, ఇతర అనుమతి ఉన్నవారు మినహా ఎవరు బయటికొచ్చినా కేసులు నమోదుచేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సాయంత్రం 6 నుంచి ఉదయం 6 వరకు కఠినంగా లాక్డౌన్ అమలుచేస్తున్నట్టు చెప్పారు. సత్తుపల్లి, మధిర, నల్లగొండ, నాగార్జునసాగర్, దేవరకొండ, మునుగోడు, మిర్యాలగూడ నియోజకవర్గాల్లో మాత్రం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే వెసులుబాటు కొనసాగుతున్నది.
టీకా వేసుకున్నా..నిబంధనలు పాటించాల్సిందే
కొవిడ్ నిబంధనలను విస్మరించడమే సెకండ్ వేవ్కు ప్రధాన కారణమని చెప్పవచ్చు. ప్రస్తుతం సెకండ్ వేవ్ పూర్తిగా అదుపులోకి వచ్చింది. దీనికి లాక్డౌన్ బ్రహ్మాస్త్రంగా పనిచేసింది. టీకా వేయించుకున్నా విధిగా నిర్ణీత దూరం, శానిటైజేషన్, మాస్క్ ధరించడం లాంటి నిబంధనలను తప్పనిసరి పాటించాలి. సామూహిక కార్యక్రమాలకు దూరం గా ఉండటం మంచిది. దూర ప్రయాణాలు ఏ మాత్రం మంచిది కాదు. లాక్డౌన్ సడలింపును దుర్వినియోగం చేస్తే చేటు తప్పదు. – డాక్టర్ రాజారావు,సూపరింటెండెంట్, గాంధీ దవాఖాన
సెకండ్వేవ్ ఒక గుణపాఠం
కొవిడ్ సెకండ్ వేవ్ మనకు తీరని విషాదాన్ని మిగిల్చింది. ఎన్నో కుటుంబాలను విచ్ఛిన్నం చేసింది. ఎంతో మంది పిల్లలను అనాథలుగా మార్చింది. ఇకనైనా ప్రజలు జాగ్రతగా ఉండాలి. ఒక పాజిటివ్ కేసు ఉన్నా అది నిప్పులా వందల మందికి వ్యాపిస్తుంది. సెకండ్వేవ్లో అదే జరిగింది. దీని నుంచి మనం గుణపాఠం నేర్చుకోవాలి.
– డాక్టర్ నాగేందర్, సూపరింటెండెంట్, ఉస్మానియా దవాఖాన
పిల్లల భద్రత గురించి ఆలోచించాలి
థర్డ్ వేవ్ వస్తే పిల్లలపై కరోనా ఎక్కువగా ప్రభావం చూపుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని తల్లిదండ్రులు తమ పిల్లల భద్రత గురించి ఆలోచించాలి. ప్రస్తుతం స్కూళ్లు, కాలేజీలన్నీ మూసే ఉన్నందున పిల్లలు బయటకు వెళ్లే పరిస్థితి లేదు. కానీ పెద్దవారు పదేపదే బయటకు వెళ్లి రావడం వల్ల పిల్లలకు వైరస్ సోకే ప్రమాదం ఉంది.