సిటీబ్యూరో, జూన్ 6(నమస్తే తెలంగాణ): సోషల్మీడియాలో పరిచయం అయిన ముగ్గురు ఒక ముఠాగా ఏర్పడి.. బ్లాక్మార్కెట్లో బ్లాగ్ ఫంగస్ ఇంజక్షన్లను విక్రయించే దందాను మొదలు పెట్టారు. విక్రయించే క్రమంలో టాస్క్ఫోర్స్ పోలీసులకు పట్టుబడ్డారు. అందులో ఒక మహిళ కూడా ఉంది. టాస్క్ఫోర్స్ డీసీపీ రాధాకిషన్రావు కథనం ప్రకారం.. కడప జిల్లాకు చెందిన వెందిదిండి నిఖిల్రెడ్డి హైదరాబాద్లోని మోతీనగర్లో నివాసముంటూ మెడికల్ ఏజెంట్గా పనిచేస్తున్నాడు. వాట్సాప్లో మందులు కావాలంటూ వచ్చే పోస్టులతో కేపీహెచ్బీ కాలనీలో నివాసముండే నెల్లూరు జిల్లాకు చెందిన మెట్ట శ్రావణి అనే గృహిణితో పాటు బోయిన్పల్లికి చెందిన మార్కెట్ ఏజెంట్గా పనిచేసే తుమన్నపల్లి వేణుతో పరిచయం అయ్యింది. ఈ ముగ్గురు ముఠాగా ఏర్పడి.. నిబంధనలకు విరుద్ధంగా అంపోటెరిసిన్ బీ ఇంజక్షన్లు ఎంఆర్పీ రూ. 315కి ఉండగా.. వాటిని బ్లాక్లో రూ. 12 వేలకు విక్రయించేందుకు ప్లాన్ చేశారు. ఈ క్రమంలో ఈ ముగ్గురు ఆదివారం బోయిన్పల్లిలోని నక్షత్ర బార్ వద్దకు ఇంజక్షన్లను విక్రయించడానికి వచ్చారు. సమాచారం అందుకున్న వెస్ట్జోన్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాజేశ్ బృందం ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకొని.. వారి వద్ద నుంచి 15 ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు తదుపరి విచారణను బోయిన్పల్లి పోలీసులకు అప్పగించారు.