బులంద్షహర్ : యూపీలోని బులంద్షహర్ జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. నర్సేనా పోలీస్స్టేషన్ పరిధిలోని బుక్లానా గ్రామంలోని ఓ ఆలయం లోపల ఓ సన్యాసిని హత్యకు గురయ్యారు. వృద్ధురాలి ఒంటిపై గాయాలు ఉండటంతో ఆమెను కొందరు హత్య చేశారని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఉదంతంపై విచారణ చేపట్టామని పోలీసులు తెలిపారు. దోపిడీ దొంగలు ఆలయంలో చోరీ చేసేందుకు వచ్చి ఆమెను హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు.
సాధ్వి హత్య విషయం వెలుగుచూడటంతో గ్రామస్తుల్లో అలజడి రేగింది.బాధితురాలి మొబైల్ ఫోన్, బ్యాంక్ పాస్బుక్ కూడా కనిపించలేదని స్ధానికులు తెలిపారు. సాధ్వి గత పదేండ్లుగా స్ధానిక చాముండ ఆలయంలో పనిచేస్తున్నారు. దోపిడీ, హత్య కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు. పోలీస్ డాగ్ స్వ్కాడ్, ఫోరెన్సిక్ టీం కూడా ఘటనా స్ధలానికి చేరుకుంది. సాధ్విని హత్య చేసిన నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని పోలీసులు తెలిపారు.