షాద్నగర్, మే30: కరోనా రోగులకు నాణ్యమైన వైద్యాన్ని అందించడంతో పాటు సకల సదుపాయాలతో కూడిన ఐసొలేషన్ కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చామని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ తెలిపారు. ఆదివారం షాద్నగర్ పట్టణంలోని మినీ స్టేడియంలో రోటరి క్లబ్ ఆఫ్ భాగ్యనగర్ సంస్థ ఆర్థిక సహాయంతో నూతనంగా ఏర్పాటుచేసిన కొవిడ్ ఐసొలేషన్ కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. ఇందులో 30 పడకలు ఉన్నాయని, బాధితులకు పౌష్టికాహారాన్ని కూడా పంపిణీ చేస్తారని చెప్పారు. తమ నివాసాల వద్ద ఐసొలేషన్ వసతి లేని రోగులు ఈ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ ఎంఎస్. నటరాజన్, రోటరి క్లబ్ ఆఫ్ భాగ్యనగర్ సంస్థ ప్రతినిధులు హన్మంత్రెడ్డి, కొల్లారెడ్డి హరి, శ్యాంసుందర్రెడ్డి, రాంనివాస్ శర్మ, శిశు సంక్షేమ శాఖ ప్రాంతీయ కార్యదర్శి రాజ్యలక్ష్మి మున్సిపల్ మాజీ చైర్మన్ విశ్వం, డిప్యూటీ జిల్లా వైద్యాధికారి డాక్టర్. దామోదర్, సర్కారు దవాఖాన ప్రధాన వైద్యుడు శ్రీనివాస్, కౌన్సిలర్లు జిటీ. శ్రీనివాస్, బచ్చలి నర్సింహా, కానుగు అంతయ్య, సర్వర్పాషా, ఒగ్గు కిశోర్, పద్మ, గౌస్జానీ, నందకిశోర్, ఎజాజ్అడ్డు, శ్రీను పాల్గొన్నారు.
రూ. 65 లక్షల నిధులతో నైట్షెల్టర్ భవనం
షాద్నగర్ పట్టణంలోని ఆర్అండ్ బీ అథితి గృహం సమీపంలో సుదూర ప్రయాణికులు సేద తీరేందుకు రూ. 65 లక్షల నిధులను వెచ్చించి నైట్ షెల్టర్ భవనాన్ని నిర్మిస్తున్నామని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ తెలిపారు. ఆదివారం ఆర్అండ్బీ శాఖ అధికారులతో కలిసి భవన నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులు ప్రయాణ మార్గంలో సేదతీరేందుకు ఈ భవనం ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు. పనులను త్వరగా ప్రారంభించాలని, నాణ్యతలో ఎక్కడ రాజీపడరాదని సూచించారు. భవనం నిర్మాణం తీరు, వసతులు, గదుల నిర్మాణాల వంటి అంశాలను అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు.