నిజామాబాద్ : ధరణి పోర్టల్ రైతులకు వరమని రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. జిల్లాలోని వేల్పూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయానికి తన వ్యవసాయ భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కోసం గురువారం ఆయన స్వయంగా వెళ్లారు.15 నిమిషాల్లోనే మ్యుటేషన్ పూర్తి చేసి ఈ-పాస్ బుక్ అందించడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అందరి రైతులకు ఇలాగే జరుగుతుందా అని ఆరా తీసారు. ధరణి పోర్టల్ వల్ల రిజిస్ట్రేషన్ సులువైందని అధికారులు వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ తీసుకువచ్చిన ధరణి పోర్టల్ రైతులకు వరం లాంటిదన్నారు. ఇది ఒక సాహసోపేత చర్య. రైతులు తమ ఆత్మగా భావించే పంట భూములు కొనుక్కోవాలన్నా, అమ్ముకోవాలన్నా కొన్నవి తమ పేరుమీద మార్చుకోవాలన్నా గతంలో సంవత్సరాల తరబడి కాళ్లు అరిగేలా తిరిగిన రిజిస్ట్రేషన్ కాకపోయేది.
కానీ ఇప్పుడు ఈ ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత రైతుల భూముల క్రయవిక్రయాలు 15 నిమిషాల్లో పూర్తవుతున్నాయి. అత్యంత పారదర్శకమైన ప్రక్రియ ఇదని ఆయన తెలిపారు.ఇట్లా దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా లేదు.రైతుల పట్ల సీఎం కేసీఆర్కు ఉన్న ప్రేమకు మచ్చుతునక ఇది. దీనికి ప్రత్యక్ష సాక్షిని నేనే.
సాయిపేట శివారులో 2ఎకరాల 39 గుంటల భూమిని కొని ఇవాళ వేల్పూర్ మండల తహశీల్దార్ కార్యాలయానికి రిజిస్ట్రేషన్ కు వస్తే నాపేరుతో కూడిన ఈ-పాస్ బుక్ ను 15 నిమిషాల్లో అందజేశారు.నాకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సేవలు ఇట్లాగే రైతులందరికి అందాలి. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మత్రి తెలిపారు.
అనంతరం మంత్రి తహశీల్దార్ కార్యాలయం పరిశీలించారు.రోజువారి రిజిస్ట్రేషన్ ప్రక్రియ వివరాలు ఆడిగితెలుసుకున్నారు .ప్రభుత్వ ఆదేశానుసారం ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.
ఈ సందర్భంగా ఆర్డీవో శ్రీనివాసులు, తహసీల్దార్ సతీష్ రెడ్డి చేతుల మీదుగా మంత్రి భూమి రిజిస్ట్రేషన్ కు సంబంధించిన ఈ-పాస్ బుక్ అందుకున్నారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ రాజశేఖర్,కార్యాలయ సిబ్బంది పలువురు పాల్గొన్నారు.