హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ)/ శంషాబాద్ రూరల్: ‘ఎలుకలు కారులోని వైర్లను కొట్టేశాయి. అయినా పర్లేదు. క్షేమంగా వచ్చేస్తానులే’.. ఓఆర్ఆర్పై శంషాబాద్ వద్ద శనివారం రాత్రి దగ్ధమైన కారులో సజీవదహనమైన వ్యక్తి తన భార్యతో సెల్ఫోన్ మాట్లాడిన చివరి మాటలివి. ఎలుకలు ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్నాయని ఈ మాటల ఆధారంగా పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రమాదంలో చనిపోయిన వ్యక్తిని డాక్టర్ నేలపాటి సుధీర్ (45)గా శంషాబాద్ పోలీసులు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలుకు చెందిన సుధీర్ కుటుంబం కూకట్పల్లి శివాజీనగర్లో ఉంటున్నది. సుధీర్ మలక్పేటలోని యశోద దవాఖానలో ఆర్థోపెడిక్ వైద్యుడిగా పనిచేస్తున్నారు. శుభకార్యం కోసం శనివారం సాయంత్రం ఒంగోలుకు బయలుదేరారు. రాత్రి 7.30 గంటల ప్రాంతంలో శంషాబాద్ పెద్ద గోల్కొండ 135 కిలోమీటర్ పాయింట్ వద్ద అకస్మాత్తుగా కారులో మంటలు చెలరేగి.. సుధీర్ సజీవదహనమయ్యారు. ఎరుపు రంగు కారు ఆధారంగా ఓఆర్ఆర్పై ఎంట్రీ వద్ద తనిఖీచేసిన శంషాబాద్ పోలీసులు.. కారు నంబర్ ఏపీ 27 సీ0206గా గుర్తించారు. కారుపై ఉన్న ఈ-చలాన్కు లింక్ఉన్న ఫోన్ నంబర్ను గుర్తించారు. దానినుంచి వెళ్లిన చివరి కాల్ ఆధారంగా చనిపోయింది డాక్టర్ సుధీర్గా నిర్ధారించుకున్నారు.
స్టీరింగ్ వద్ద మంటలు.. పేలిన డీజిల్ ట్యాంక్
కారు స్టీరింగ్ వద్ద వైర్లు తెగడం వల్లే షార్ట్ సర్క్యూట్ జరిగిందని, ఏసీ వల్ల మంటలు వేగంగా వ్యాపించాయని శంషాబాద్ పోలీసులు భావిస్తున్నారు. ఆపై డీజిల్ ట్యాంక్ పేలిందని అనుమానిస్తున్నారు. మంటలు చెలరేగడంతో కారు డోర్లన్నీ బిగిసుకుపోయి, అందులోనే చిక్కుకుని సుధీర్ ప్రాణాలు వదిలినట్టు భావిస్తున్నారు. హోండా అమేజ్ కారులో స్టీరింగ్ వద్ద వైర్లు తెగినా, ఇతర సమస్యలు వచ్చినా కారు డోర్లు బిగిసుకుపోతాయని పలువురు మెకానిక్ల అభిప్రాయాలతో తెలిసింది. అధికారిక సమాచారం కోసం శంషాబాద్ పోలీసులు.. ఆర్టీఏ అధికారులు, హోండా సంస్థ ప్రతినిధులకు లేఖలు రాయనున్నట్టు సమాచారం. అగ్నిమాపకశాఖ నివేదిక వచ్చాక ప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలుస్తాయని శంషాబాద్ డీసీపీ ప్రకాశ్రెడ్డి తెలిపారు. కారులో మంటలు, పొగలు వస్తున్నట్టు గమనించినా, కాలిన వాసన వచ్చినా అప్రమత్తం కావాలని పోలీసులు చెప్తున్నారు. డోర్లు బిగిసుకుపోతే సీట్ బెల్టు బకెల్ సాయంతో అద్దాలను పగుల గొట్టాలని సూచిస్తున్నారు.