చెన్నై: కొంత ఆలస్యమైనా సరే ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించడమే మంచిదని ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) అధ్యక్షుడు కమల్ హాసన్ తమిళనాడు ప్రభుత్వానికి సూచించారు. రాష్ట్రంలోని విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఎంకే స్టాలిన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కమల్హాసన్ కోరారు.
కొవిడ్-19 కారణంగా సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ పరీక్షలను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఇప్పటికే చాలామంది విద్యా నిపుణులు విమర్శలు చేస్తున్నారని కమల్హాసన్ గుర్తుచేశారు. సరైన ప్రణాళికతో పరీక్షలు నిర్వహించడం అనేది మంచి పద్ధతని, ప్రొఫెషనల్ కోర్సులు, విదేశీ యూనివర్సిటీల్లో ప్రవేశాలకు ఇంటర్మీడియట్లో వచ్చిన మార్కులు చాలా కీలకమని కమల్ అన్నారు.
అవసరమైతే సిలబస్ను కొంత మేర కుదించి పరీక్షలకు ముందే విద్యార్ధులకు సమాచారం ఇవ్వాలని కమల్హాసన్ సూచించారు. కేరళ ప్రభుత్వం ఇప్పటికే పరీక్షలు నిర్వహించిన విషయాన్ని పాలకులు గమనించాలన్నారు. తమిళనాడు ప్రభుత్వం కేరళను ఆదర్శంగా తీసుకుని విద్యార్ధుల భవిష్యత్తుకు ఎంతో కీలకమైన పరీక్షలను నిర్వహించాలని కోరారు.