జైపూర్: ఒక వ్యక్తిని కట్టేసి కొట్టడంతోపాటు బలవంతంగా మూత్రం తాగించారు. అతడిపై అత్యాచారం ఆరోపణలు మోపి పోలీసులకు అప్పగించారు. రాజస్థాన్లోని కోటాలో ఈ ఘటన జరిగింది. 22 ఏండ్ల యువకుడి కాళ్లు, చేతులను అతడి దూరపు బంధువులైన దంపతులు కట్టేశారు. అతడ్ని కొట్టడంతోపాటు బలవంతంగా మూత్రం తాగించారు. అతడి వద్ద ఉన్న డబ్బులు, వస్తువులను తీసుకున్నారు. ఒక రాత్రంతా నిర్బంధించారు. మరునాడు అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ ఇంట్లోకి ప్రవేశించి మహిళపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపించారు. దీంతో పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు.
మరోవైపు ఆ వ్యక్తి సోదరుడు ఈ ఆరోపణలను ఖండించాడు. అహ్మదాబాద్లో పని చేసే తన సోదరుడు ఇటీవల సొంతూరుకు వచ్చాడని తెలిపాడు. జగ్పురా గ్రామంలోని తమ బంధువుల అతడ్ని తమ ఇంటికి రమ్మని పిలిచినట్లు చెప్పాడు. ఈ నెల 14న వారి ఇంటికి వెళ్లిన తన సోదరుడి చేతులు, కాళ్లు కట్టేసి కొట్టారని, బలవంతంగా మూత్రం తాగించి రాత్రంతా నిర్బంధించారని ఆరోపించాడు. సోదరుడి మొబైల్ ఫోన్, ఐడీ కార్డుతోపాటు రూ.22,000 నగదును ఆ దంపతులు తీసుకున్నారని తెలిపాడు.
ఆంటీ, అంకుల్ ఈ దారుణాన్ని తమ మొబైల్లో రికార్డు చేసి పొరపాటున ఆన్లైన్లో పోస్ట్ చేశారని, అది వైరల్ అయ్యిందని ఆ వ్యక్తి సోదరుడు చెప్పాడు. కాగా, వైరల్ అయిన ఈ వీడియో ఆధారంగా ఆ దంపతులతోపాటు మరో వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ ప్రవీన్ జైన్ తెలిపారు. దీనిపై దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించారు.