జైపూర్: భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ ఓ చిన్నారి నిండు ప్రాణాలను బలితీసుకుంది. భార్య ముసుగు ధరించలేదన్న కోపంతో ఓ వ్యక్తి తన మూడేండ్లే బిడ్డ కాళ్లుపట్టి నేలకు కొట్టాడు. దాంతో చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. రాజస్థాన్ రాష్ట్రంలోని అల్వార్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. అల్వార్ జిల్లాకు చెందిన ప్రదీప్ యాదవ్ అనే వ్యక్తితో మోనికా అనే యువతికి కొన్నేండ్ల కిందట వివాహం జరిగింది.
వారికి మూడేండ్ల పాప ఉంది. అయితే, పెళ్లి అయిన నాటి నుంచి ఆచారాల పేరిట ప్రదీప్ ఆమెను మానసికంగా వేధిస్తూ వచ్చాడు. ముఖానికి ముసుగు ధరించాలంటూ పదేపదే ఇబ్బంది పెట్టేవాడు. కానీ, భార్య మాత్రం భర్త మాటను పెడచెవిన పెట్టేది.
దాంతో వారి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలోనే మంగళవారం కూడా భార్యాభర్తల మధ్య ముసుగు విషయంలో గొడవ జరిగింది. ఆమె ముసుగు వేసుకోననేసరికి కోపంతో ఊగిపోయిన ప్రదీప్ ఆమెపై చేయి చేసుకున్నాడు.
తర్వాత ఆ కోపాన్ని కూతురిపై చూపించాడు. భార్య చేతిలో ఉన్న చిన్నారిని లాక్కుని కాళ్లుపట్టి బయటకు విసిరేశాడు. దాంతో తీవ్రంగా గాయపడ్డ చిన్నారి మరణించింది. ఈ విషయం బయటకు పొక్కకుండా తన కుటుంబంతో కలిసి ఆ చిన్నారి మృతదేహాన్ని ప్రదీప్ ఖననం చేశాడు. అయితే, జరిగిన ఘటనపై బుధవారం బెహ్రార్ పోలీసులకు మోనిక ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం నిందితుడు ప్రదీప్ పరారీలో ఉన్నాడు.