జైపూర్: దొంగగా నిందమోపి తీవ్రంగా కొట్టడమేగాక, నెత్తి కొరిగించడంతో ఓ యువకుడు మనస్థాపానికి గురయ్యాడు. అవమానం భరించలేక ఆత్మహత్యకు ( Man commits suicide ) పాల్పడ్డాడు. రాజస్థాన్ రాష్ట్రం నాగౌర్ జిల్లాలోని దవా గ్రామంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బికనీర్లోని నోఖా పట్టణానికి చెందిన ఒమారాం జాట్ (25) ఆదివారం నాగౌర్ జిల్లాలోని దవా గ్రామానికి చెందిన బంధువుల ఇంటికి వెళ్లాడు.
అయితే ఆ గ్రామంలో ఓ దొంగతనం జరుగడంతో ఒమారాం జాట్నే దొంగగా అనుమానించి గ్రామంలోని కొంతమంది తీవ్రంగా కొట్టారు. అనంతరం అతని జుట్టు కత్తిరించి అవమానించారు. అంతటితో ఆగక ఆ దృశ్యాలను ఫోన్లలో చిత్రించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సోమవారం తన సొంతూరుకు వెళ్లిన యువకుడు అమానభారంతో బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు.