చండీఘడ్ : ఆక్సిజన్ సిలిండర్లను గోడౌన్ లో దాచి అధిక ధరలకు విక్రయిస్తున్న బ్లాక్ మార్కెట్ రాకెట్ ను హర్యానా పోలీసులు రట్టుచేసి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బదాపూర్ లోని గోడౌన్ లో దాడులు చేపట్టిన అధికారులు, పోలీసులు 260 ఆక్సిజన్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్ ధరకు మూడు రెట్లు అధికంగా ఈ సిలిండర్లను బ్లాక్ మార్కెట్ లో నిందితులు విక్రయిస్తున్నారని పోలీసులు వెల్లడించారు.
ఆక్సిజన్ సిలిండర్లను ఒక్కోటి రూ 35,000కు వీరు కొవిడ్-19 రోగులు, బంధువులకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. నిందితులను వికాస్ మాన్ (32), శివ కుమార్ (33), ప్రభాత్ కుమార్ (31)లుగా గుర్తించారు. మహారాష్ట్ర నుంచి 470 ఆక్సిజన్ సిలిండర్లను కొనుగోలు చేసిన నిందితులు బ్లాక్ మార్కెట్ లో అధిక ధరలకు విక్రయించేందుకు వాటిని అక్రమంగా గోడౌన్ లో నిల్వ చేశారని పోలీసులు తెలిపారు.