జలంధర్: అతనో రక్షక భటుడు. తప్పుచేసిన వాళ్లను స్టేషన్లో పెట్టి తాటా తీయాల్సిన సబ్ ఇన్స్పెక్టర్. కానీ, అతనే ఓ పెద్ద దుర్మార్గానికి పాల్పడ్డాడు. కారులో మితిమీరిన వేగంతో వెళ్తూ అదుపు చేయలేక రోడ్డు పక్కన నిలబడి ఉన్న ఇద్దరు మహిళలను ఢీకొట్టాడు. మహిళలు కిందపడిపోయినా కారును ఆపకుండా వాళ్లను తొక్కిస్తూ పారిపోయాడు. ఈ ఉదయం 8.30 గంటలకు పంజాబ్ రాష్ట్రం జలంధర్లోని కంటోన్మెంట్ ఏరియాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఈ ఘటనలో నవజ్యోత్ అనే మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. ఆమె స్నేహితురాలైన మరో మహిళ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నది. సమాచారం అందుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా ప్రమాదానాకి కారణమైన కారును గుర్తించారు. కారు నడిపింది పంజాబ్కు చెందిన సబ్ ఇన్స్పెక్టర్ అమ్రిత్పాల్ సింగ్గా గుర్తించి అరెస్టు చేశారు. కాగా, ఒక పోలీస్ అధికారి ఇలా కారుతో ఢీకొట్టి పారిపోయాడని తెలిసి స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఘటనను నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించారు. ఘటనకు బాధ్యుడైన ఎస్ఐ అమ్రిత్పాల్ సింగ్పై హత్య కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్ఐపై హత్య కేసు నమోదుచేసే వరకు రహదారిపై రాకపోకలు సాగనిచ్చేది లేదని తెగేసి చెప్పారు. చివరికి పోలీస్ ఉన్నతాధికారులు హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.