హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): భారత రాజ్యాంగం దేశంలోని ప్రతి పౌరుడికి భావప్రకటనా స్వేచ్ఛను కల్పించింది. ఎవరైనా తమ భావాలను స్వేచ్ఛగా వ్యక్తపరిచేందుకు, వార్తలను ప్రచురించుకునేందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఏ) అవకాశాన్నిచ్చింది. అయితే దేశ, సమాజ హితానికి సంబంధించిన అంశాల్లో ఈ స్వేచ్ఛపై ఆర్టికల్ 19(2)లో కొన్ని పరిమితులు విధించింది. ఈ విషయంలో మితిమీరితే ఎంతటివారికైనా చిక్కులు తప్పవని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. స్మార్ట్ఫోన్ చేతిలో ఉందికదా అని సామాజిక మాధ్యమాల్లో అడ్డగోలు పోస్టులు పెట్టినా.. చెడు రాతలు రాసినా కటకటాలపాలై కఠిన శిక్షలు అనుభవించాల్సిందేనని హెచ్చరిస్తున్నారు.
ఐటీయాక్ట్ 67, 67(ఏ):
సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు, అసభ్యకరమైన పోస్టులు, మార్ఫింగ్ చిత్రాలు, వీడియోలు పెట్టేవారిపై చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయి. ఈ విషయంలో పిల్లలైనా, పెద్దలైనా ఐటీ చట్టంలోని 67, 67(ఏ) సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తారు. వీటిలో మొదటి సెక్షన్ కింద మూడేండ్లు, రెండో సెక్షన్ కింద ఐదేండ్లు జైలు శిక్ష విధిస్తారు. పిల్లలైతే నేరనిరూపణ తర్వాత బోస్టన్ స్కూల్లో వేస్తారు.
ఐపీసీ సెక్షన్ 153:
సమాజంలో అల్లర్లు చెలరేగేలా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసినా, ఉద్దేశపూర్వకంగా ప్రజలను రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా ఏడాదిపాటు జైలు శిక్ష, జరిమానా తప్పదు.
ఐపీసీ సెక్షన్లు 499, 500:
మాటలు, చేతలు, చదవడం ద్వారా ఇతరులను అవమానించి వారి గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తిస్తే రెండేండ్లపాటు సాధారణ జైలు శిక్ష, జరిమానా విధిస్తారు.
సీన్-1: దుబాయ్లో ఉంటున్న జగిత్యాల జిల్లా వాసి పన్యాల రాజు గతేడాది జనవరిలో సీఎం కేసీఆర్ను దూషిస్తూ ఫేస్బుక్లో అభ్యంతరకరమైన పోస్టు పెట్టాడు. నన్నెవరు పట్టుకుంటారులే అని దుబాయ్లో కులుకుతున్న రాజుకు తెలంగాణ పోలీసులు తగిన బుద్ధి చెప్పారు. అతడిపై ఐపీసీ 188, 505(1)(b), 469, 54 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
సీన్-2: దేశానికి ఏ సంవత్సరంలో స్వాతంత్య్రం వచ్చిందో తెలియకుండా మాట్లాడినందుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రిని చెంపదెబ్బ కొట్టేవాడిని అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి నారాయణ్రాణేని ఇటీవలే పోలీసులు అరెస్టు చేశారు. ఉన్నత పదవిలో కొనసాగుతూ రాజ్యాంగబద్ధమైన స్థానంలో ఉన్న మరో వ్యక్తిపై అనుచిత వ్యాఖ్యలు చేసిందుకు నారాయణ్రాణే చట్టం ముందు దోషిగా నిలబడక తప్పలేదు.
సీన్-3: వైఎస్సార్సీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఏపీ ప్రభుత్వంపైనా, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపైన తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తుండడంతో ఆయనపైన ఏపీ సర్కార్ కేసులు నమోదు చేసింది. అనంతరం ఏపీ సీఐడీ అధికారులు హైదరాబాద్లోని రఘురామకృష్ణరాజు నివాసానికి వచ్చి మరీ ఆయనను అరెస్టు చేశారు.