లక్నో : యూపీలో మహిళలు, బాలికలపై లైంగిక వేధింపుల ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆగ్రాలో ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స కోసం చేరిన 18 ఏండ్ల బాలికపై అక్కడి ఉద్యోగి లైంగిక వేధింపులకు గురిచేసిన ఘటన కలకలం రేపింది. మధుర జిల్లాలోని కొత్వాలి నగరం ప్రాంతంలో మంగళవారం రాత్రి ఈ ఉదంతం చోటుచేసుకుంది. బుధవారం కేసు నమోదైన ఇప్పటివరకూ ఎవరినీ అరెస్ట్ చేయలేదు.
నిందితుడు మూడు రోజుల కిందటే ఆస్పత్రిలో ఉద్యోగంలో చేరినట్టు తెలిసింది. అదే ఆస్పత్రిలో కడుపు నొప్పితో బాలిక చికిత్స పొందుతుండగా డాక్టర్ పెయిన్ కిల్లర్ ఇచ్చాడు. ఆపై బాలిక మగత నిద్రలో ఉండగా నిందితుడు అసభ్యంగా తాకాడు.
ఆ తర్వాత మరోసారి బాలికను లైంగికంగా వేధించేందుకు ప్రయత్నించగా బాలిక మేలుకోవడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. బాలిక పట్ల అమర్యాదకరంగా వ్యవహరించిన నిందితుడిని శ్యామ్ గుజ్జర్ గా అక్కడి సిబ్బంది గుర్తించారు. బాలిక కుటుంబసభ్యుల ఫిర్యాదుపై నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.