కామారెడ్డి టౌన్, మార్చి 27: పేదింటి ఆడబిడ్డలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన 202 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను శనివారం పంపిణీ చేశారు. కామారెడ్డిలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఇప్పటివరకు 3,747 మందికి 37 కోట్ల 12 లక్షల 02 వేల 332 రూపాయల విలువైన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశామని చెప్పారు. పేదింటి ఆడబిడ్డల పెండ్లి తల్లిదండ్రులకు భారం కావొద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టారని చెప్పారు. ఆడబిడ్డను కూడా మగ పిల్లాడితో సమానంగా పెంచాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ప్రేమ్కుమార్, నియోజకవర్గంలోని వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.