పుణే : రాజస్ధాన్ కు చెందిన ఇద్దరు కేటుగాళ్లు సోషల్ మీడియా వేదికలపై మహిళలుగా పోజులు కొడుతూ పలువురికి టోకరా ఇచ్చిన ఘటన వెలుగుచూసింది. పుణేకు చెందిన దాదాపు వంద మంది పురుషులను వీడియో కాల్స్ లో నగ్నంగా మారేలా రెచ్చగొట్టి ఆపై ఆ వీడియోలను చూపి వీరు బ్లాక్ మెయిల్ కు పాల్పడుతూ అందినకాడికి దండుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నిందితులు ఇద్దరూ సోషల్ మీడియాలో మహిళల పేరుతో ప్రొఫైల్స్ ఓపెన్ చేసి పురుషులతో స్నేహం పెంచుకుని ఆపై ముగ్గులోకి దింపుతారు. నగ్నంగా వీడియో కాల్స్ చేయాలని రెచ్చగొట్టి ఆ వీడియాలను రికార్డు చేసి తర్వాత వాటిని చూపి డబ్బులు డిమాండ్ చేస్తారు.
పుణేకు చెందిన దాదాపు 50 మంది పురుషులను వీరు డబ్బులు ఇవ్వాలని బెదిరించారు. నిందితులు తమను రూ 3000 నుంచి రూ 25,000 వరకూ ఇవ్వాలని బెదిరించారని, డబ్బు ఇవ్వకుంటే తమ నగ్న వీడియోలను సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తామని బ్లాక్ మెయిల్ కు దిగారని బాధితులు ఫిర్యాదు చేశారు. సాంకేతిక నిఘా సాయంతో నిందితులను పసిగట్టిన పుణే పోలీసులు వారిని పట్టుకునేందుకు రాజస్ధాన్ వెళ్లారు. అయితే ఇలాంటి కేసులోనే రాజస్ధాన్ పోలీసులు ఇద్దరు నిందితులను అప్పటికే అరెస్ట్ చేసినట్టు తెలిసింది. ఇక రాజస్ధాన్ పోలీసుల నుంచి నిందితులను పుణే పోలీసులు త్వరలో తమ కస్టడీలోకి తీసుకున్నారు.