లక్నో: ఐదుగుర్ని హత్య చేశారంటూ ఒక బాలిక చేసిన ఫ్రాంక్ ఫోన్ కాల్ పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో ఈ ఘటన జరిగింది. మూడవ తరగతి చదువుతున్న 8 ఏండ్ల బాలిక మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు తండ్రి మొబైల్ నుంచి పోలీస్ హెల్ప్లైన్కు ఫోన్ చేసింది. ‘పోలీస్ అంకుల్. లేన్ నంబర్ 5లోని ప్రభుత్వ స్కూల్ వద్ద ఐదుగురు హత్యకు గురయ్యారు. దయచేసి తర్వగా రండి. నేను ఒంటిరిగా ఉన్నాను’ అని చెప్పింది.
షాక్ అయిన పోలీసులు వెంటనే ఆ బాలిక చెప్పిన ప్రాంతానికి చేరుకున్నారు. అయితే అక్కడ ఎలాంటి హత్యల ఆనవాళ్లు వారికి కనిపించలేదు. దీంతో ఆ బాలిక ఫోన్ చేసిన మొబైల్కు కాల్ చేయగా స్విచ్ఛాఫ్ అని వచ్చింది. కొంతసేపటి తర్వాత పోలీసులు మళ్లీ ప్రయత్నించగా బాలిక తండ్రి కాల్ లిఫ్ట్ చేశాడు. జరిగింది ఆయనకు చెప్పగా తమ కుమార్తె ఫ్రాంక్ కాల్ చేసి ఉంటుందని తెలిపాడు.
తమ కుమార్తె గతంలో కూడా ఇలా ఫ్రాంక్ కాల్స్ చేసిందని బాలిక తండ్రి పోలీసులకు చెప్పాడు. తనకు ప్రమాదం జరిగినట్లు తమ బంధువులకు ఫోన్ చేయగా వారు హుటాహుటిన తమ ఇంటికి వచ్చారని తెలిపాడు. మరోవైపు ఆ బాలిక టీవీలో వచ్చే క్రైమ్ షోలు చూస్తుందని, పోలీసులు స్పందిస్తున్నారా లేదా అన్నది తెలుసుకునేందుకు అప్పుడప్పుడు పోలీస్ హెల్ప్ లైన్కు ఫోన్ చేస్తుందని పోలీసులు తెలుసుకున్నారు. ఇకపై ఇలా జరుగకుండా చూడాలని బాలిక తండ్రిని పోలీసులు హెచ్చరించారు.