చొప్పదండి, జూలై 8: ప్రతి ఒక్కరూ ఇంటితో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, కలెక్టర్ శశాంక ప్రజలకు సూచించారు. పట్టణంలోని 9వ వార్డులో చేపట్టిన పట్టణ ప్రగతి పనులను గురువారం వారు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, కలెక్టర్ మాట్లాడుతూ, ఇంటిని ఎలా శుభ్రంగా ఉంచుకుంటున్నారో వీధుల్లోనూ చెత్త వేయకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. మురుగు కాలువలను శుభ్రం చేయించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు. హరితహారంలో భాగంగా ప్రజలకు మొక్కలు పంపిణీ చేశారు. వారి వెంట మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజ-భూమారెడ్డి, వైస్చైర్పర్సన్ ఇప్పనపల్లి విజయలక్ష్మి-సాంబయ్య, సింగిల్విండో చైర్మన్లు వెల్మమల్లారెడ్డి, మినుపాల తిరుపతిరావు, కౌన్సిలర్ కొత్తూరి మహేశ్, కమిషనర్ అంజయ్య, తహసీల్దార్ రజిత, ఏఈ రాజేశం, కో-ఆప్షన్ సభ్యుడు అజ్జు, తదితరులు ఉన్నారు.
గంగాధర, జూలై 8: మండలంలో పల్లె ప్రగతి కార్యక్రమం జోరుగా సాగింది. గ్రామాల్లోని వైకుంఠధామాలు, డంప్ యార్డులు, కంపోస్టు షెడ్లను ప్రజాప్రతినిధులు, అధికారులు పరిశీలించి, పరిసరాల్లో మొక్కలు నాటారు. వీధుల్లో పేరుకుపోయిన చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి సెగ్రిగేషన్ షెడ్డుకు తరలించారు. మార్కెట్ ఆవరణలో, ప్రధాన కూడళ్లలో ఊడ్చి శుభ్రం చేశారు. మురుగు కాలువలను శుభ్రం చేయించి బ్లీచింగ్ పౌడర్ చల్లారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటి, ట్రీగార్డులు ఏర్పాటు చేశారు. శిథిలావస్థలో ఉన్న ఇండ్లను తొలగించారు. గ్రామాల్లో విరిగిన స్తంభాలను తొలగించి, కొత్తవి ఏర్పాటు చేశారు. పరిసరాల పరిశుభ్రత, సీజనల్ వ్యాధుల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ఉపసర్పంచులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
రామడుగు, జూలై 8: మండలంలోని వెంకట్రావుపల్లిలో పారిశుధ్య సిబ్బంది మట్టి, పెంటకుప్పలు, చెత్తాచెదారం తొలగించారు. సేకరించిన చెత్తను సర్పంచ్ జవ్వాజి శేఖర్ ట్రైసైకిల్లో డంప్ యార్డుకు తరలించారు. దేశరాజ్పల్లిలో ఎంపీడీవో ఎన్నార్ మల్హోత్రా ఉపాధి కూలీలతో కలిసి మొక్కలు నాటి, నీళ్లు పోశారు. అన్ని గ్రామాల్లో పాలకవర్గ సభ్యులు, అధికారులు స్వచ్ఛ భారత్ నిర్వహించారు. అంతర్గత దారులు, ప్రధాన రహదారులను శుభ్రం చేశారు. కార్యక్రమాల్లో ఆయా గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, ప్రత్యేకాధికారులు, పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.కరీంనగర్ రూరల్, జూలై 8: చెర్లభూత్కూర్లోని డంప్ యార్డు, సెగ్రిగేషన్షెడ్డు ఆవరణలో ప్రజాప్రతినిధులు, అధికారులు మొక్కలు నాటారు. సర్పంచ్ దబ్బెట రమణారెడ్డి, ఎంపీటీసీ బుర్ర తిరుపతి గౌడ్, పంచాయతీ కార్యదర్శి వాయిస్, వార్డు సభ్యులు, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చేగుర్తి గ్రామ ప్రత్యేకాధికారి శైలజ పిలుపునిచ్చారు. గ్రామంలోని వాటర్ ప్లాంట్కు వెళ్లే దారిలో హరితహారంలో భాగంగా ఆమె సర్పంచ్ చామనపల్లి అరుణారాజయ్యతో కలిసి మొక్కలు నాటారు. ఈసందర్భంగా ప్రత్యేకాధికారి మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ ఇంటి ఆవరణలో మొక్కలు నాటి, సంరక్షించాలని కోరారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి పరశురాములు, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.