హైదరాబాద్ సిటీబ్యూరో, మే 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కూకట్పల్లి హెచ్డీఎఫ్సీ ఏటీఎం దోపిడీ దొంగలు ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. నిందితులు అజిత్కుమార్, ముఖేశ్కుమార్ సొంత రాష్ట్రమైన బీహార్కు వెళ్తున్న క్రమంలో పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ.6.31లక్షల నగదు, తుపాకీ, ఖాళీ మ్యాగజైన్, బుల్లెట్, మొబైల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. గచ్చిబౌలిలోని తన కార్యాలయంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీపీ సజ్జనార్ బుధవారం కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. సీపీ వివరాల ప్రకారం.. బీహార్కు చెందిన అజిత్కుమార్ బతుకుదెరువు కోసం 2011లో హైదరాబాద్కు వచ్చాడు. దుండిగల్, కీసర, మేడ్చల్ ప్రాంతాల్లోని పలు పరిశ్రమల్లో కూలీ పనిచేశాడు. ఆ డబ్బులు సరిపోవడం లేదని దోపిడీకి ప్లాన్ వేశాడు. 2018లో దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో ఓ మనీట్రాన్స్ఫర్ నిర్వాహకుడి వద్ద దోపిడీకి యత్నించగా.. విఫలం కావడంతో పారిపోయాడు. ఈ కేసులో దుండిగల్ పోలీసులు అతడిని అరెస్ట్చేసి జైలుకు పంపారు. జైలు నుంచి బయటకొచ్చిన అజిత్కుమార్ తిరిగి బీహార్కు వెళ్లిపోయాడు.
2020లో అజిత్కుమార్ తిరిగి నగరానికి వచ్చి ప్యాకింగ్ కూలీగా పనిచేశాడు. మళ్లీ దోపిడీకి ప్లాన్వేశాడు. మార్చిలో బీహార్లోని స్నేహితుడు ముఖేశ్కుమార్కు రూ.30 వేలు పంపించి.. తుపాకీ, ఐదు బుల్లెట్లు తీసుకురమ్మని చెప్పగా.. అతను వాటితో హైదరాబాద్కు వచ్చాడు. ఇద్దరు కలిసి తుపాకీతో డీ పోచంపల్లిలో ఫైరింగ్ ప్రాక్టీస్ చేశారు. గతనెల 16న జీడిమెట్ల పరిధిలోని ఓ మనీ ట్రాన్స్ఫర్ నిర్వాహకుడిని తుపాకీతో బెదిరించి రూ.1.95 లక్షలను దోచుకున్నారు. అక్కడి నుంచి వెళ్లి తూప్రాన్లోని బీహార్కు చెందిన స్నేహితుడి ఇంట్లో ఉన్నారు. రెండురోజుల తర్వాత తిరిగి వచ్చి గతనెల 24న దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో పల్సర్బైక్ను చోరీ చేశారు. దానిపై తిరుగుతూ గతనెల 29న కూకట్పల్లికి వచ్చారు. అక్కడ హెచ్డీఎఫ్సీ ఏటీఎం కేంద్రంలో డబ్బు నింపుతుండటాన్ని గమనించి దోపిడీకి ప్లాన్వేసి ఆ వాహనాన్ని వెంబడించారు. మధ్యాహ్నం 1.50 నిమిషాలకు పటేల్కుంటలోని విజయనగర్కాలనీ హెచ్డీఎఫ్సీ ఏటీఎంలో డబ్బు నింపుతుండగా.. హెల్మెట్ ధరించిన అజిత్కుమార్ తుపాకీతో అక్కడికి వెళ్లాడు. గమనించిన వాహనం సెక్యూరిటీగార్డు అలీబేగ్ అతడిని అడ్డుకున్నారు. అజిత్కుమార్.. అలీబేగ్పై కాల్పులు జరుపుతుండగా గమనించిన ఏటీఎంలో ఉన్న శ్రీనివాస్ అతడిని అడ్డుకునేందుకు యత్నించగా ఆయనపై కూడా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో సెక్యూరిటీగార్డు అలీబేగ్ స్పాట్లోనే మృతి చెందారు. బైక్పై ఉన్న ముఖేశ్కుమార్ ఆదేశంతో అజిత్ ఏటీఎం లోపలికి వెళ్లి రూ.500 నోట్ల కట్టలు రూ.5 లక్షలు తీసుకొని బైక్ ఎక్కుతుండగా హెల్మెట్ కిందపడిపోయింది. మియాపూర్, బాచుపల్లి, కాజిపల్లి, ఓఆర్ఆర్ మీదుగా మేడ్చల్కు వెళ్లారు. అక్కడి నుంచి నేరుగా గుండ్లపోచంపల్లిలోని వారి గదికి వెళ్లి అక్కడే ఉన్నా రు. త్వరలోనే బీహార్కు వెళ్లేందుకు ప్లాన్ వేసుకున్నారు. సమాచారం అందుకున్న సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు మం గళవారం వారిద్దరిని అరెస్టుచేశారు. ఈ దుండగులను పట్టుకున్న ఎస్వోటీ బృందాన్ని సీపీ ప్రత్యేకంగా అభినందించారు. దొంగలిద్దరిపై సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో మొత్తం ఐదు కేసులు ఉన్నాయి. వీరిపై హత్య, దోపి డీ కేసుల కింద పోలీసులు అభియోగాలు నమోదు చేశారు.