హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ): రుణ యాప్ల పేరుతో దారుణాలకు పాల్పడిన వ్యవహారంపై హైదరాబాద్ సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసుల దర్యాప్తు దాదాపు పూర్తయింది. చార్జిషీట్ తయారీ కూడా తుది దశకు చేరుకున్నది. 197 రుణ యాప్లకు సంబంధించి 157 కంపెనీలపై 27 కేసులు నమోదు చేశారు. ఇప్పటి వరకు ఇద్దరు చైనీలు సహా 26 మందిని అరెస్ట్ చేశారు. ఈ యాప్ల సృష్టి, ఆర్థిక లావాదేవీల నిర్వహణలో చైనా దేశస్థులే కీలకపాత్ర పోషించినట్టు నిర్ధారించారు. ఈ యాప్ల ద్వారా సుమారు రూ.25 వేల కోట్ల ఆర్థిక లావాదేవీలు జరిగినట్టు తొలుత పోలీసులు భావించినప్పటికీ పూర్తిస్థాయిలో లెక్కలు తేల్చిన తర్వాత ఆ మొత్తం రూ.19 వేల కోట్లు ఉన్నట్టు నిర్ధారణకు వచ్చారు. దర్యాప్తులో భాగంగా రూ.400 కోట్లను ఫ్రీజ్ చేశారు. దర్యాప్తులో పలు ఆసక్తికర అంశాలను వెలుగులోకి తెచ్చారు. ఈ యాప్ల నిర్వాహకులు భారత్లో ఆర్థిక లావాదేవీల నిర్వహణకు పలు అడ్డదారులు తొక్కడంతోపాటు కొన్ని నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ (ఎన్బీఎఫ్సీ)లతో కుమ్మక్కయినట్టు తేల్చారు. భారత్లో అడ్డగోలుగా తమ కంపెనీలను రిజిస్టర్ చేయించడంతోపాటు ఆయా కంపెనీల్లో బినామీలను డైరెక్టర్లుగా నియమించారని, ఒకే చిరునామాతో పదుల సంఖ్యలో కంపెనీలను సృష్టించారని నిర్ధారించారు. భారత్లో వసూలైన సొమ్ములో కొంత భాగం నేరుగా.. మరికొంత భాగం హాంకాంగ్ మీదుగా చైనాకు తరలివెళ్లినట్టు గుర్తించారు. ఈ కేసులో అంతర్జాతీయ లింకులు బయటపడటంతో ఈ వ్యవహారంపై అమెరికా కూడా ఆసక్తి చూపింది. రుణ యాప్లపై హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసుల దర్యాప్తులో బయటకొస్తున్న అంశాలపై అమెరికాలోని న్యూయార్క్ టైమ్స్ లాంటి ప్రధాన పత్రికలతోపాటు డిస్కవరీ చానల్ ఇప్పటికే ఆరా తీశాయి.
వారంలో చార్జిషీట్!
రుణ యాప్ల కేసు కొలిక్కి వచ్చింది. త్వరలో చార్జిషీట్ దాఖలుకు సిద్ధమవుతున్నాం. ఇప్పటివరకు సేకరించిన సమాచారంతో చార్జిషీటు రూపొందిస్తున్నాం. ఈ ప్రక్రియ ఈ వారంలోనే పూర్తవుతుంది. ఉన్నతాధికారుల సూచన మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాం. మరోవైపు కేంద్ర సంస్థలు కూడా ఈ కేసును దర్యాప్తు చేస్తున్నాయి. మేం ఫ్రీజ్ చేసిన ఖాతాల్లోని నగదును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) స్వాధీనం చేసుకునేందుకు అవకాశాలున్నాయి. ఇప్పటికే ఈడీ ఈ రుణ యాప్ల ఆస్తులను జప్తుచేసే ప్రక్రియను మొదలు పెట్టినట్టు తెలుస్తున్నది.
కేవీఎం ప్రసాద్, ఏసీపీ, సీసీఎస్ సైబర్క్రైమ్స్