న్యూఢిల్లీ, మే 29: అదొక స్టార్టప్ సంస్థ. కానీ వేతనాల చెల్లింపుల్లో మాత్రం అగ్రగామి సంస్థల కంటే ముందు వరుసలో నిలచింది. ఏకంగా ఏడాదికి 100 కోట్ల వార్షిక వేతనం చెల్లించి రికార్డుల్లోకి ఎక్కింది. ఆ సంస్థే జిరోధా. దేశంలో ప్రస్తుతం అతిపెద్ద స్టాక్ బ్రేకరేజ్ సేవలు అందిస్తున్న జిరోధా వ్యవస్థాపకులు నితిన్ నిఖిల్ కామత్ సోదరులు చెరో రూ.100 కోట్లు వార్షిక జీతభత్యాలుగా అందుకోనున్నారు. ఈ మేరకు కంపెనీ బోర్డు ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించింది. కంపెనీ డైరెక్టర్ అయిన నితిన్ కామత్ సతీమణి సీమా పాటిల్ కూడా అంతే జీతాన్ని అందుకోవడం విశేషం. ఈ తీర్మానం ప్రకారం వీరికి నెలకు రూ.4.17 కోట్ల చొప్పున జీతం, ఇతర అలవెన్సులు కలుపుకుంటే ఏడాదికి రూ.300 కోట్లు అవుతుంది. ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పారేఖ్ గడిచిన ఆర్థిక సంవత్సరానికి తీసుకున్న రూ.49.68 కోట్లకంటే జిరోధా వ్యవస్థాపకుల జీతం ఎక్కువగా వుండటం విశేషం. స్టార్టప్ కంపెనీగా మొదలైన జిరోధా గతేడాది రూ. 1,000 కోట్ల ఆదాయంపై రూ. 442 కోట్ల లాభాన్ని ఆర్జించింది. స్టార్టప్ల్లో చాలావరకూ నష్టాల్లో నడుస్తుండగా, ఇటువంటి పనితీరును కనపర్చిన కంపెనీలు అరుదు. కంపెనీ ఉద్యోగులకు లభించిన ఎంప్లాయిస్ స్టాక్ ఆప్షన్ల కోసం జిరోధా గతేడాది ఒక బైబ్యాక్ను 1 బిలియన్ డాలర్ల విలువతో నిర్వహించగా, ఈ ఏడాది 2 బిలియన్ డాలర్ల విలువతో బైబ్యాక్ జరుపుతున్నట్లు నితిన్ కామత్ ట్వీట్ చేశారు. దీంతో ప్రస్తుతం జిరోధా కంపెనీ విలువ రూ.14,600 కోట్లకు చేరుకున్నది. అయితే తమ వ్యాపారానికి రిస్క్లు ఎక్కువని, స్టాక్ మార్కెట్లతో తమ పనితీరు అనుసంధానమై వుంటుందని, ప్రస్తుతం ఇండియాలో మార్కెట్లు బావున్నాయని కామత్ వివరించారు.