చిత్తూరు : శునకాన్ని విశ్వాసానికి మారుపేరుగా భావిస్తారు. అవి, తన యజమాని పట్ల ఎనలేని ప్రేమను చూపిస్తాయన్న సంగతి తెలిసిందే. తన యజమానిని శత్రువుల నుంచి కాపాడేందుకు కూడా శతవిధాలా ప్రయత్నిస్తాయి. తనను ఎంతో ప్రేమగా చూసుకునే అమ్మాయి పట్ల ఓ కీచకుడు అత్యాచారం చేయబోతుంటే.. శునకం ఆమెను కాపాడింది. ఈ ఘటన చిత్తూరు జిల్లాలోని గొల్లపల్లె గ్రామంలో చోటు చేసుకుంది.
బుధవారం రాత్రి 17 ఏండ్ల యువతి తన ఇంటి డాబాపై నిద్రిస్తుండగా.. ఓ యువకుడు(27) అత్యాచారం చేసేందుకు యత్నించాడు. దీంతో ఆమె కాపాడంటూ గట్టిగా కేకలు వేసింది. ఆ ఇంటి పెంపుడు కుక్క అప్రమత్తమైంది. ఆ శునకం పరుగున ఆమె వద్దకు వెళ్లిపోయింది. యువకుడిపై దాడి చేసి.. వీరోచితంగా పోరాడింది. చివరకు కుక్క అతన్ని కరిచింది. అప్పటికే ఇరుగుపొరుగు వారు మేల్కొని.. అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. కానీ తప్పిపోయాడు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. యువతిపై అత్యాచారం చేసేందుకు యత్నించిన యువకుడిని పెనుమూరు బస్టాండ్లో గురువారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.