హాలీవుడ్లో అత్యంత విజయవంతమైన సినిమా ఫ్రాంచైజీల్లో ‘‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’’ ఒకటి. ఈ చిత్రాలు చూసిన కొందరు ఆ సినిమాల్లో చూపించినట్లే హైటెక్ సాంకేతికను ఉపయోగించి.. కార్ల దొంగతనాలకు పాల్పడ్డారు. ఈ హైటెక్ చోరీలు దేశ రాజధాని ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో వెలుగు చూశాయి.
విషయం తెలుసుకొని రంగంలోకి దిగిన పోలీసులు.. మనీష్ రావు (42), జగదీప్ శర్మ (43), ఆస్ మహమ్మద్ (40) అనే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ‘రవి ఉత్తమ్ నగర్ గ్యాంగ్’ అనే పేరుతో ఈ ముగ్గురూ కలిసి చాలా కార్లు దొంగిలించారు. స్కానర్లు, జీపీఎస్ జామర్లు ఉపయోగించి వీళ్లు కార్లను కాజేసేవాళ్లు.
వీళ్ల దగ్గర నుంచి రెండు తుపాకీలు, రకరకాల టెక్నికల్ వస్తువులు, సెన్సార్ కిట్ అయస్కాంతాలు, ఎల్ఎన్టీ తాళం చెవులు, ఎనిమిది రిమోట్ కంట్రోల్ కార్ తాళాలు స్వాధీనం చేసుకున్నారు. ఒక కారులో ఉండే సాఫ్ట్వేర్ను పూర్తిగా డిలీట్ చేసేసి కొత్త సాఫ్ట్వేర్ వేస్తామని, దానికి తగ్గట్లు వెంటనే తాళం రెడీ అయిపోతుందని నిందితులు దర్యాప్తులో వెల్లడించారు.
అలాగే ఢిల్లీ ఎన్సీఆర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో నలభైపైగా కార్లను తాము ఇలా దొంగిలించామని చెప్పారు. దొంగిలించిన తర్వాత సీసీ కెమెరాలో లేని ప్రాంతాల్లో వాటిని పార్క్ చేసే వాళ్లమని, ఆ తర్వాత భారీ డీల్స్కు వాటిని అమ్మేస్తామని తెలిపారు. ఇలాంటి డీల్ చేయడానికి వచ్చినప్పుడే నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.