భువనగిరి అర్బన్ : కంపెనీ నుంచి గుట్టుచప్పుడు కాకుండా రసాయనాలను దొంగలించి వేరేచోట విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు డీసీపీ నారాయణరెడ్డి తెలిపారు. డీసీపీ కథనం ప్రకారం.. భూదాన్పోచంపల్లి మండల పరిధిలోని దోతిగూడెం సమీపంలో అప్టిమాస్ డ్రగ్స్ ప్రైవేటు కంపెనీ ఉంది. ఈ కంపెనీలో కొన్ని రోజుల నుంచి పల్లాడియం కార్బన్, ప్లాటినం మెటల్ (రసాయనాలు)లను గుర్తు తెలియని వ్యక్తులు దొంగలిస్తున్నారని కంపెనీ మేనేజర్ అన్నదాసు రామకృష్ణ ఈ నెల 6న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పెద్ద అంబర్పేటలో నివాసం ఉంటూ కంపెనీలో షిప్ట్ ఇన్చార్జీగా పని చేస్తున్న సామ రఘునాథ్రెడ్డిపై నిఘ పెట్టగా బుధవారం ఉదయం 9గంటల సమయంలో సామ రఘునాధరెడ్డి వద్దగల పల్లాడియం కార్బన్, ప్లాటినం మెటల్ను యెల్లగిరి ఎక్స్రోడ్డు వద్ద కూకట్పల్లికి చెందిన దూదేకుల లాలు స్వామికి విక్రయిస్తుండగా చౌటుప్పల్ సీఐ వారిని పట్టుకుని అరెస్టు చేశారు.
రఘునాథరెడ్డి వద్ద 900 గ్రాముల పల్లాడియం కార్బన్, కేజీ ప్లాటినం, ఒక సెల్ ఫోన్, ఒక సేల్ డీడ్ డాక్యుమెంట్, దూదేకుల లాలు స్వామి వద్ద 14కేజీల పల్లాడియం కార్భన్, 3.800 గ్రాముల ప్లాటినం, ఒక సెల్ఫోన్, కారు, ఒక వెల్డింగ్ మిషన్ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఇద్దరి వద్ద స్వాధీనం చేసుకున్న రసాయనాల విలువ సూమారు రూ. 47లక్షల వరకు ఉంటుందన్నారు.