పాట్నా : ఓ వ్యక్తి అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరాడు. అతను కరోనాతో చనిపోయాడని డెత్ సర్టిఫికెట్ జారీ చేశారు. కానీ కడసారి చూపులో.. అతను తమ వ్యక్తి కాదని తెలిసి కుటుంబ సభ్యులు షాక్కు గురయ్యారు. ఈ ఘటన బీహార్ రాజధాని పాట్నా మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చోటు చేసుకుంది.
చున్ను కుమార్(40) అనే వ్యక్తికి మెదడులో రక్తం గడ్డ కట్టడంతో పాట్నా మెడికల్ కాలేజీ ఆస్పత్రికి ఏప్రిల్ 3వ తేదీన తీసుకెళ్లారు. ఈ క్రమంలో అతనికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని, ఆదివారం చనిపోయాడని ఆస్పత్రి సిబ్బంది కుమార్ కుటుంబ సభ్యులకు తెలిపారు. ఇక ఆస్పత్రి సిబ్బంది డెడ్ బాడీని అప్పగించి, డెత్ సర్టిఫికెట్ను కూడా జారీ చేశారు. కుమార్ను కడసారి చూసేందుకు అతని కుటుంబ సభ్యులు ముఖంపై కప్పిన బట్టను తీసి చూసేసరికి షాక్ అయ్యారు.
ఆ డెడ్ బాడీ కుమార్ది కాదు.. మరొకరిది అని తేలింది. దీంతో బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని మెడికల్ కాలేజీ సూపరింటెండెంట్ డాక్టర్ ఐఎస్ ఠాకూర్ తెలిపారు.
ఇటీవలే తమ కుటుంబం మొత్తం కరోనా పరీక్షలు చేయించుకున్నాం. అందరికీ నెగిటివ్ వచ్చింది. తన భర్తకు కాలు విరగడంతో గత కొద్ది ఏండ్ల నుంచి బయటకు వెళ్లడం లేదు. అతనికి కరోనా పాజిటివ్ ఎలా నిర్ధారణ అవుతోంది. రోగుల పట్ల వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారని కుమార్ భార్య కవిత మండిపడ్డారు.