న్యూఢిల్లీ : కరోనా సెకండ్ వేవ్ తో కొవిడ్-19 చికిత్సలో ఉపయోగించే ఆక్సిజన్ సిలిండర్లు, ప్రాణాధార మందుల బ్లాక్ మార్కెటింగ్ యధేచ్చగా సాగుతోంది. ఢిల్లీలోని ఖాన్ మార్కెట్ లో ఓ రెస్టారెంట్ లో నిల్వ చేసిన 93 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల బ్లాక్ మార్కెట్ గురించిన సమాచారం అందడంతో ఖాన్ మార్కెట్ ప్రాంతంలోని ఖాన్ చచా రెస్టారెంట్ పై పోలీసులు దాడులు జరిపారు.
ఈ దాడుల్లో రెస్టారెంట్ లో దాచిన 93 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లాక్ డౌన్ అమల్లో ఉన్నా రెస్టారెంట్ ను తెరిచిఉంచిన నిందితులు ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల బ్లాక్ దందాకు తెరలేపారు. నిందితులపై నిత్యావసర వస్తువుల చట్టం, అంటువ్యాధుల చట్టం కింద కేసు నమోదు చేశారు. కాగా లోథి రోడ్డులోని ఓ రెస్టారెంట్ లో 419 ఆక్సిజన్ సిలిండర్లు పట్టుబడిన కొద్దిరోజులకే ఈ ఉదంతం వెలుగుచూడటం గమనార్హం.