జైపూర్ : కేసు ఉపసంహరించుకోలేదనే కోపంతో లైంగిక దాడి కేసులో నిందితుడు బెయిల్ పై బయటకు వచ్చి బాధితురాలిని దారుణంగా హత్య చేసిన ఘటన రాజస్థాన్ లోని సిరోహి జిల్లాలో చోటుచేసుకుంది. గత ఏడాది మహిళపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడు ఆమెను కేసు వాపస్ తీసుకోవాలని కోరగా నిరాకరించినందుకు ఈ దారుణానికి తెగబడ్డాడు. బాధితురాలి ఇంటి పక్కనే ఉంటూ సాయం పేరుతో గత ఏడాది నేత్రం అనే నిందితుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు.
ఈ కేసులో అరెస్టయిన నిందితుడిని ఆరు నెలలు జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. ఈ ఏడాది ఏప్రిల్ లో నేత్రం బెయిల్ పై విడుదలయ్యాడు. బయటకు వచ్చిన తర్వాత నిందితుడు కేసును వెనక్కితీసుకోవాలని ఆమెను పలుమార్లు కోరాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి మహిళ వేషధారణలో బాధితురాలి ఇంటికి వెళ్లి ఆమె నిద్రిస్తుండగా కత్తితో దాడిచేశాడు. అడ్డగించిన బాధితురాలి సోదరినీ వేధించిన నిందితుడు ఆపై ఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని సోమవారం అదుపులోకి తీసుకున్నారు.