లక్నో: భార్యకు నిప్పు పెట్టిన భర్త కాలిన గాయాలతో ఉన్న ఆమెను రోడ్డుపై పడేశాడు. ఉత్తరప్రదేశ్లోని జలాన్ జిల్లా ఓరై ప్రాంతంలో ఈ దారుణం జరిగింది. సీసా గ్రామానికి చెందిన 23 ఏండ్ల ఉమకు ఓరై ప్రాంతానికి చెందిన ఆరిఫ్తో కోర్టు ద్వారా వివాహం జరిగింది. కాగా మంగళవారం ఉదయం అజ్నారా హైవే వద్ద ఉన్న దాబాకు ఎదురుగా కాలిన గాయాలతో సుమారు రెండున్నర గంటలు పడి ఉన్న ఉమను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఝాన్సీ జిల్లా ఆసుపత్రికి ఆమెను తరలించగా పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా, భర్త తనకు నిప్పుపెట్టినట్లు ఉమ వాగ్మూలం ఇచ్చింది. దీంతో పారిపోయిన ఆమె భర్త కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆరిఫ్ కుటుంబ సభ్యులతోపాటు దాబా నిర్వాహకుడిని పిలిపించి ప్రశ్నించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.