నల్లగొండ : ఆస్తి కోసం వృద్ధురాలు అని కూడా చూడకుండా కన్నతల్లిని ఓ కసాయి కొడుకు, అతడి భార్య తీవ్రంగా హింసించారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం పార్వతీపురం గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. కోటయ్య, కిష్టమ్మ(60) ఇరువురు దంపతులు. వీరికి ఇద్దరు కొడుకులు. ఉన్న 20 ఎకరాల్లో ఇద్దరి కొడుకులకు చెరో 8 ఎకరాలు పంచి రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వగా తమ పోషణ నిమిత్తం నాలుగు ఎకరాలు తమ వద్దే ఉంచుకున్నారు. పొలంలో ఇల్లు కట్టుకుని అక్కడే వేరేగా ఉంటూ జీవిస్తున్నారు.
కాగా ఉన్న నాలుగు ఎకరాలను కూడా తన పేర రిజిస్ట్రేషన్ చేయాల్సిందిగా పెద్ద కొడుకు ఎట్టె సూరయ్య అతడి భార్య భూదేవి ఇరువురు కలిసి వృద్ధురాలైన కిష్టమ్మ కళ్లలో కారం చల్లి కొడవలితో దాడి చేశారు. తలపై తీవ్ర గాయాలు కావడంతో పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న నిడమనూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని చికిత్స నిమిత్తం బాధితురాలిని మిర్యాలగూడలోని ఆస్పత్రికి తరలించారు. దాడి అనంతరం భార్యాభర్తలిద్దరూ సంఘటనా స్థలం నుంచి పారిపోయారు. కిష్టయ్య 2019లో ఆస్తి విషయంలో గొడవపడి తల్లిపై కర్రతో దాడి చేసినట్లుగా సమాచారం.