ఆగ్రా : ఆస్తి పంపకాలకు అంగీకరించలేదని కన్నతండ్రిని (62) మంచానికి చైన్తో కట్టేసిన కుమారుల ఉదంతం యూపీలోని మధురలో వెలుగుచూసింది. యూపీ రోడ్డు రవాణా సంస్ధలో డ్రైవర్గా పనిచేస్తున్న బాధితుడిని మధుర జిల్లా శిహోర గ్రామంలో కన్న కొడుకులే దారుణంగా హింసించారు. ఆస్తిని పంచేందుకు తండ్రి నిరాకరించడంతో వృద్ధుడని కూడా చూడకుండా కన్న కొడుకులు ఇంట్లోని ఓ గదిలో బంధించారు. మంచానికి చైన్తో కట్టేసి వేధింపులకు గురిచేశారు.
బాధితుడిని సవాల్ సింగ్గా పోలీసులు గుర్తించారు. సింగ్ సీనియర్ సిటిజన్ హెల్ప్లైన్కు ఫిర్యాదు చేయడంతో ఆయనపై కుమారుల అరాచకం వెలుగుచూసింది. వృద్ధుడిని కాపాడేందుకు ముందు ఆయన మంచంపై ఉండగా కాలును చైన్తో కట్టేసిన వీడియో వైరల్గా మారింది. తాను మంచం మీదే మలమూత్ర విసర్జన చేయాల్సిన దుస్ధితి కల్పించారని తండ్రి వాపోయారు. తన మనవళ్ల సాయంతో చైన్ను తెంచుకుని ఇంటి నుంచి తప్పించుకుపోయానని జూన్ 25న సవాల్ సింగ్ సీనియర్ సిటిజన్స్ హెల్ప్లైన్కు కాల్ చేయడంతో ఈ దారుణం వెలుగుచూసింది.
కుటుంబ సభ్యులు బాగా చూసుకుంటామని హామీ ఇవ్వడంతో సమస్య అప్పటికి పరిష్కారమైంది. తర్వాత మరోసారి ఆయనను మంచానికి కట్టిపడేశారని, ఆయన ఫోన్ను పగులగొట్టారని తనకు తెలియడంతో తాము ఘటనా ప్రాంతానికి వెళ్లామని హెల్ప్లైన్ ఫీల్డ్ రెస్పాన్స్ అధికారి ప్రమోద్ సోలంకి వెల్లడించారు. పోలీసులతో కలిసి సింగ్ ఇంటికి వెళ్లి ఆయనను విడిపించామని చెప్పారు.