భువనేశ్వర్: ఐదు వేల అప్పు తీర్చేందుకు ఒక తండ్రి ఏకంగా తన రెండున్నర ఏండ్ల కుమార్తెను అమ్మాడు. విషయం తెలుసుకున్న ఆ పాప తాత పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఒడిశాలోని జాజ్పూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. మద్యానికి బానిస అయిన రమేశ్ కుమార్ బారిక్, బిన్జార్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సహదేవ్పూర్ గ్రామానికి చెందిన లిటు జెనా నుండి రూ .5 వేలు అప్పు తీసుకున్నాడు. కాగా, రెండున్నర ఏండ్ల బిడ్డను వదిలి రమేశ్ భార్య తన పుట్టింటికి వెళ్లింది. దీంతో అప్పు తీర్చాలని అడిగిన లిటుకు తన కుమార్తెను రమేశ్ అప్పగించాడు. విషయం తెలుసుకున్న పాప తాత రవీంద్ర బారిక్ తన కుమారుడు రమేశ్తోపాటు లిటు జెనాపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పిల్లల సంరక్షణ అధికారులు ఆ చిన్నారిని రక్షించి చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించారు. మరోవైపు రూ.5 వేల అప్పు తీర్చేందుకు చిన్నారిని తండ్రి అమ్మిన ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.