భువనేశ్వర్: భోజనం చేసిన కస్టమర్, బిల్లులో రూ.5 తక్కువగా చెల్లించడంపై హోటల్ యజమాని మండిపడ్డాడు. తన కుమారుడితో కలిసి అతడ్ని చావకొట్టాడు. ఒడిశాలోని కియోంజర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. జితేంద్ర దేహురి అనే వ్యక్తి ఘసీపూర్లోని ‘అమ్మ హోటల్’కు వెళ్లి భోజనం చేశాడు. రూ.45 చెల్లించాలని హోటల్ యజమాని చెప్పాడు. అయితే తన వద్ద రూ.40 మాత్రమే ఉన్నదని, మిగతా ఐదు రూపాయలు మరోసారి వచ్చినప్పుడు ఇస్తానని జితేంద్ర తెలిపాడు. దీనికి హాటల్ యజమాని మధు సాహు ఒప్పుకోలేదు. కాగా, కూరగాయలతో కూడిన ప్లేట్ మీల్స్కు రూ.45 తీసుకుంటారా అని కస్టమర్ జితేంద్ర వాదనకు దిగాడు. దీంతో హాటల్ యజమాని సాహు తన కుమారుడితో కలిసి అందరూ చూస్తుండగా అతడిపై దాడి చేసి దారుణంగా కొట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కస్టమర్ జితేంద్ర దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో హోటల్ యజమాని మధు సాహుపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్పీ మిత్రభాను తెలిపారు. సాహు కుమారుడు మైనర్ కావడంతో అతడిపై ఎలాంటి చర్య తీసుకోలేదని చెప్పారు.