జిల్లాలోనే పట్టణాన్ని అదర్శంగా తీర్చిదిద్దుతా
ప్రతి ఒక్కరి దరికిసంక్షేమ ఫలాలు
మాజీ మంత్రి, ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి
జడ్చర్ల మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారం
జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి
జడ్చర్ల, ఏప్రిల్ 24 : టీఆర్ఎస్ ప్రభు త్వ హయాంలోనే జడ్చర్ల పట్టణం అభివృద్ధి బాటలో పయనించిందని ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. శనివారం జడ్చర్ల మున్సిపాలిటీలోని 20వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి శ్రావణీశ్యాం తరపున సర్దార్ వల్లభాయ్ పటేల్ నగర్, శ్రీరాంనగర్, రాంమందిర్, మజీద్ ప్రాంతం, కూరగాయల మార్కెట్, 17వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి చైతన్య తరపున శాంతినగర్, శ్రీరాంనగర్, గంజ్, వాల్మీకి నగర్లలో, 6వ వార్డులో రమేశ్, 21వ వార్డులో హరిత తరపున ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో చేపట్టిన ప్రజాసంక్షేమ పథకాల ఫలాలు ప్రతి ఒక్కరికీ అందించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. జడ్చర్ల గతంలో కన్నా కనీవిని ఎరుగని రీతిలో అభివృద్ధి చెందిందన్నారు. మరింత అభివృద్ధి చేసి జిల్లాలోనే ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామన్నారు. ప్రధాన కూడళ్లను సుందరంగా మార్చామని, ప్రధాన రహదారులను నాలుగులేన్లుగా విస్తరించినట్లు తెలిపారు. ప్రతి కాలనీలో మురుగు కాలువలు, సీసీరోడ్లు, బీటీరోడ్డు నిర్మించినట్లు వివరించారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లానీళ్లు సరఫరా చేసే పనులు దాదాపు పూర్తి కావొచ్చాయన్నారు.
త్వరలో ఇంటింటికీ శుద్ధ జలాలను అందించనున్నట్లు చెప్పారు. అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లను ఇస్తామని, ఇంటిస్థలాలు ఉండి ఇండ్లు నిర్మించుకోలేని వారికి ప్రభుత్వమే భవనం నిర్మించి ఇస్తుందన్నారు. ఇప్పటికే 15 వందల ఇండ్లు మంజూరయ్యాయని, అందులో దాదాపు వెయ్యి ఇండ్లు పూర్తయినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఇంకా 15 వందల ఇండ్ల మంజూరుకు కృషి చేస్తున్నామన్నారు. కావేరమ్మపేట వద్ద రూ.3 కోట్ల నిధులతో మినీ ట్యాంక్బండ్ను నిర్మించి ఇటీవలే ప్రారంభించినట్లు చెప్పారు. బాదేపల్లి నడిబొడ్డున ఉన్న నల్లకుంటను మినీ ట్యాంక్బండ్గా, సందర్శకుల కోసం పార్కు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర సంగీత, నాటక అకాడమీ చైర్మన్ బాద్మి శివకుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ కాట్రపల్లి లక్ష్మయ్య, మాజీ చైర్మన్ మురళి, జగన్, శ్యాం, సునీల్, అబ్దుల్లా, మారుతిశేఖర్, దామోదర్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.