చండీగఢ్: హర్యానాలోని ఫరీదాబాద్లో గత ఏడాది సంచలనం రేపిన నికితా తోమర్ హత్య కేసులో ప్రధాన నిందితుడు తౌసిఫ్, అతడి అనుచరుడు రెహాన్ను దోషులుగా ఫరీదాబాద్ జిల్లా సెషన్స్ కోర్టు బుధవారం నిర్ధారించింది. హత్యకు ఉపయోగించిన దేశీయ తయారీ తుపాకీని సరఫరా చేసిన ఆరోపణలపై అరెస్టయిన అజారుద్దీన్, అలియాస్ అజ్రును నిర్దోషిగా ప్రకటించింది. ఈ నెల 26న దోషులకు శిక్షలు ఖరారు చేయనున్నది.
గత ఏడాది అక్టోబర్ 26న 21 ఏండ్ల నికితా తోమర్ను కిడ్నాప్ చేసేందుకు తౌసిఫ్ ప్రయత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో కాల్పులు జరిపాడు. దీంతో నికితా తోమర్ చనిపోయింది. పట్టపగలు జరిగిన ఈ హత్య సీసీటీవీలో రికార్డు అయ్యింది. దీంతో నిందితులు తౌసిఫ్, అనుచరుడు రెహాన్తోపాటు అజ్రును పోలీసులు అరెస్ట్ చేశారు.
కాగా, నికిత తనను మోసం చేసి మరొకరిని పెండ్లి చేసుకునేందుకు సిద్ధం కావడంతో ఆమెను చంపినట్లు నిందితుడు తౌసిఫ్ పోలీసులకు తెలిపాడు. ఆమె వల్ల తన జీవితం నాశనం అయ్యిందని, 2018లో నికిత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో తనను అరెస్ట్ చేయడంతో వైద్య విద్యను కొనసాగించలేకపోయినట్లు తెలిపాడు. అందుకే ప్రతీకారంతో నికితను హత్య చేసినట్లు కేసు దర్యాప్తు చేసిన సిట్కు వెల్లడించాడు.
మరోవైపు పెండ్లి చేసుకుని మతం మారాలని తమ కుమార్తెను తౌసిఫ్ బలవంతం చేసినట్లు ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ‘లవ్ జిహాద్’ కోణంలో కూడా సిట్ దర్యాప్తు చేసింది.