హైదరాబాద్: నగరంలోని సైఫాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో ఈ తెల్లవారుజామున దోపిడీ జరిగింది. స్థానికంగా ఓ మార్వాడీ ఇంట్లో పనిమనుషులుగా చేరిన నేపాలీ దంపతులు ఈ దోపిడీకి పాల్పడ్డారు. సమయం చూసి యజమాని ఇంట్లోని నగలు, నగదు ఎత్తుకెళ్లినట్లు సమాచారం. ఈ ఘటన నేపథ్యంలో పనిమనుషులను పెట్టుకునే ముందు నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీపీ అంజనీకుమార్ సూచించారు. వారి వివరాలను పూర్తిగా తెలుసుకోవాలన్నారు.
పని మనుషులుగా పెట్టుకునే వ్యక్తుల వివరాలు తెలుసుకోవడమేగాక, ఆ వివరాలను స్థానిక పోలీస్స్టేషన్లలో కూడా నమోదు చేయించాలని చెప్పారు. హైదరాబాద్లో హాక్ ఐ యాప్ను తీసుకొచ్చామని, ఈ యాప్లో కొత్తవారి వివరాలు నమోదుచేయడం ద్వారా గతంలో వారికి ఏమైనా నేరచరిత్ర ఉంటే తెలుసుకోవచ్చని తెలిపారు. గత ఏడాది కాలంలో 38 మంది నేపాలీలు ఇలాంటి చోరీలకు పాల్పడ్డారని, ప్రజలు అప్రమత్తంగా ఉంటే ఈ నేరాలకు అడ్డుకట్టవేయడం సులువవుతుందని సీపీ వెల్లడించారు.