న్యూఢిల్లీ : దేశ రాజధానిలో దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. మైనర్ బాలికను అపహరించిన దుండగులు బలవంతంగా వ్యభిచార కూపంలోకి నెట్టారు. రెండు నెలల తర్వాత బాధిత బాలిక(12)ను ఢిల్లీ పోలీసులు మజ్నుక తిల ప్రాంతం నుంచి కాపాడారు. కేసులో సవ్యంగా విచారణ చేపట్టడంలో పోలీసులు నిర్లక్ష్యం వహించారని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కపషెర పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రాంతం నుంచి బాలికను జనవరి 22న కిడ్నాప్ చేసిన దుండగులు బలవంతంగా వ్యభిచార వృత్తిలోకి దింపారు.
పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన రెండు నెలల తర్వాత పశ్చిమ జిల్లా పోలీసులు చొరవతో బాలిక బయటపడింది. నిందితుల్లో ఇద్దరు తమ పొరుగువారేనని తాము ఫిర్యాదు చేసి నెలలు గడిచినా స్ధానిక పోలీసులు ఎలాంటి చర్య చేపట్టలేదని బాలిక కుటుంబ సభ్యులు ఆరోపించారు. కిడ్నాపింగ్ కేసుపై తొలుత పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, దీంతో స్ధానిక పోలీస్ అధికారిని మరో స్టేషన్కు బదిలీచేశామని, దీనిపై దర్యాప్తు ముమ్మరం చేశామని ఆగ్నేయ ఢిల్లీ డీసీపీ ప్రతాప్ సింగ్ పేర్కొన్నారు.